సెప్టెంబర్ 6 నుంచి అన్ని గ్రామాల్లో ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలి: సీఎం కేసీఆర్

Related image

సెప్టెంబర్ 6 నుంచి అన్ని గ్రామాల్లో 30 రోజుల పాటు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన కార్యాచరణపై మార్గదర్శకం చేసేందుకు ముఖ్యమంత్రి రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులతో వచ్చే నెల 3న మద్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ లోని తెలంగాణ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీలలో తక్కువ వేతనాలతో పనిచేస్తున్న 36వేల మంది సఫాయి కర్మచారుల వేతనాన్ని రూ.8,500కు పెంచాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. పంచాయతీరాజ్ శాఖలో అన్ని ఖాళీలను భర్తీ చేయడంతో పాటు, కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు జత చేసి, నెలకు రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు విడుదల చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలును పర్యవేక్షించేందుకు గ్రామానికి ఒకరు చొప్పున మండల స్థాయి అధికారులను ఇన్ చార్జులుగా నియమించాలని కలెక్టర్లను సీఎం ఆదేశించారు. మండల, జిల్లా పరిషత్ లను క్రియాశీలకంగా మార్చేందుకు అవసరమైన సిఫారసులను కలెక్టర్ల నుంచి స్వీకరించి, నిబంధనలు రూపొందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు.

పచ్చదనం, పరిశుభ్రతతో గ్రామాలు వెల్లివిరియాలని, ప్రణాళికా పద్థతిలో గ్రామాల అభివృద్ధి జరగాలని, నియంత్రిత్వ పద్ధతిలో నిధులు వినియోగం జరగాలని, మొత్తంగా విస్తృత ప్రజా భాగస్వామ్యంతో గ్రామాల రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ బృహత్తర లక్ష్యం నెరవేర్చడానికి అవసరమైన ఒరవడి అవడడానికి 30 రోజుల కార్యాచరణ నాంది పలకాలని సీఎం ఆకాంక్షించారు. మొదట 60 రోజుల ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని నిర్ణయించినప్పటికీ, అధికారుల నుంచి వచ్చిన సూచన మేరకు మొదటి దశలో 30 రోజుల పాటు నిర్వహించి, మరో దశ కొనసాగించాలని నిర్ణయించారు. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా చేస్తున్న ఈ ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించినట్లు కూడా సీఎం వెల్లడించారు.
గ్రామాల్లో అమలు చేయాల్సిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై శుక్రవారం ప్రగతి భవన్ లో 7 గంటల పాటు సమీక్ష జరిగింది. పలువురు మంత్రులు, కలెక్టర్లు, డిపిఓలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మంత్రులు, అధికారులతో విస్తృతంగా చర్చించిన తర్వాత 30 రోజుల్లో గ్రామాల్లో నిర్వహించాల్సిన పనులను ఖరారు చేశారు:

- మొదటి రోజు గ్రామ సభ నిర్వహిస్తారు. 30 రోజుల ప్రత్యేక కార్యారణ ఎందుకు నిర్వహిస్తున్నారనే విషయాన్ని ప్రజలకు విడమరిచి చెబుతారు. ప్రభుత్వ ఉద్దేశ్యాలను వివరిస్తారు. ప్రజల విస్తృత భాగస్వామ్యాన్ని ఆహ్వానించాలి
- రెండో రోజు కో ఆప్షన్ సభ్యుల ఎంపిక, గ్రామ పంచాయతీ స్టాండింగ్ కమిటీల ఎంపిక నిర్వహించాలి
- సర్పంచ్ కుటుంబ సభ్యులను కో ఆప్షన్ సభ్యులుగా ఎంపిక చేయడానికి వీలులేదు
- గ్రామానికున్న అవసరాలేంటి? ఉన్న వనరులేంటి? అనే విషయాలను బేరీజు వేసుకుని, వాటికి అనుగుణంగా ప్రణాళికలు రూపొందించాలి
- ఆ ఏడాది చేయాల్సిన పనులకు సబంధించి వార్షిక ప్రణాళికను, ఐదేళ్లలో చేయాల్సిన పనులకు సంబంధించి పంచవర్ష ప్రణాళికను రూపొందించాలి
- ఈ ప్రణాళికలకు గ్రామసభ నుంచి ఆమోదం తీసుకోవాలి
- ఈ ప్రణాళిక ఆధారంగానే నిధులు ఖర్చు చేయాలి

పారిశుధ్య నిర్వహణ:

- కూలిపోయిన ఇళ్ళు మరియు భవనాల శిథిలాలను తొలగించాలి
- పనికిరాని, ఉపయోగించని బావులు మరియు లోతట్టు ప్రాంతాలను పూడ్చడం ద్వారా నీరు నిలువకుండా చర్యలు చేపట్టి దోమల ఉత్పత్తిని నిరోధించాలి
- పాఠశాలలు, అంగన్‌వాడీలు వంటి అన్ని ప్రభుత్వ సంస్థలను శుభ్రపరచాలి
- సర్కారు తుమ్మ, జిల్లేడు లాంటి పిచ్చిమొక్కలను తొలగించాలి
- అన్ని రహదారులను శుభ్రం చేయాలి
- డ్రైనేజీలను శుభ్రం చేయాలి. డ్రెయిన్లను రిపేరు చేయాలి. మురికి కాలువల్లోని ఇరుక్కుపోయిన చెత్తచెదారం తొలగించాలి
- అపరిశుభ్ర ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లటం ద్వారా పరిశుభ్రతా కార్యక్రమాలను చేపట్టాలి
- లోతట్టు ప్రాంతాలలో, రోడ్లపై నిలిచిన నీటిని తొలగించాలి
- గ్రామస్తులందరూ నెలలో రెండుసార్లు శ్రమదానంలో పాల్గొనేలా ప్రోత్సహించాలి
- సంతలు, మార్కెట్ ప్రదేశాలను శుభ్రపరచాలి
- గ్రామ పంచాయతీలు ట్రాక్టర్లను సమకూర్చుకోవాలి. మొక్కలకు నీరు పోయడానికి, చెత్త సేకరణకు ట్రాక్టర్ సమకూర్చుకోవాలి
- అన్ని గ్రామాల్లో డంప్ యార్డ్‌ ఏర్పాటుకు కావల్సిన భూమిని గుర్తించాలి. అందుకు తగిన ప్రభుత్వ భూమి అందుబాటులో లేనట్లయితే పంచాయతీ నిధులతో స్థలం కొనుగోలు చేయాలి
- స్మశాన వాటిక నిర్మాణానికి అనుగుణమైన స్థలం గుర్తించాలి
- గ్రామ పంచాయతీలో వందశాతం మరుగుదొడ్లు నిర్మించడానికి ప్రణాళిక రూపొందించాలి

హరిత హారం:

- గ్రామ పంచాయతీలే గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున, శాశ్వత ప్రాతిపదికన నర్సరీల ఏర్పాటుకు అనువైన స్థలం ఎంపిక చేయాలి
- నర్సరీలను పెంచడానికి ఫారెస్ట్ రేంజ్ అధికారి గ్రామ పంచాయతీలకు సాంకేతిక సహకారం అందించాలి
- అటవీ శాఖ 12,751 గ్రామ పంచాయతీ హరిత హరం నర్సరీలతో పాటు కొన్ని ప్రత్యేకమైన జాతులతో (మొక్కలతో) తమ సొంత నర్సరీలను పెంచుకోవచ్చు
- గ్రామ పంచాయతీ రైతులను, వారికి అవసరమైన మొక్కలను వ్యవసాయ విస్తరణాధికారుల సహకారంతో గుర్తించాలి. ఇంటి దగ్గర నాటడానికి అవసరమైన పండ్లు, పూల మొక్కల ఇండెంట్ ను గ్రామపంచాయతీ సేకరించాలి. గ్రామపంచాయతీ లోపల నాటడానికి అందుబాటులో ఉన్న భూములను మరియు పంచాయతీ సరిహద్దుల్లో ఉన్న భూములు మరియు రహదారులను కూడా గ్రామపంచాయతీ గుర్తించాలి. ఈ వివరాల ఆధారంగా, గ్రామపంచాయతీ గ్రీన్ ప్లాన్‌(హరిత ప్రణాళిక)ను సిద్ధం చేయాలి. ఈ గ్రీన్ ప్లాన్ (హరిత ప్రణాళిక)ను గ్రామసభ ఆమోదించాలి
- జిల్లా గ్రీన్ కమిటీ సూచనలకు అనుగుణంగా హరిత ప్రణాళిక రూపొందించాలి
- గ్రామ పంచాయతీలు మొక్కలు పెట్టడంతో పాటు, రక్షణ బాధ్యత తీసుకోవాలి

పవర్ వీక్:

- 30 రోజుల కార్యాచరణలో భాగంగా వారం రోజుల పాటు పవర్ వీక్ నిర్వహంచాలి
- వేలాడుతున్న, వదులుగా ఉండే కరెంటు వైర్లు మరియు విద్యుత్ స్తంభాలను సరిచేయాలి
- వంగిన స్తంభాలను సరిచేయాలి. తుప్పు పట్టిన స్తంభాల స్థానంలో కొత్త స్తంభాలు పెట్టాలి
- వీధి దీపాల సమర్థ నిర్వహణకు థర్డ్ వైర్, సపరేట్ మీటర్, స్విచ్చులు బిగించాలి
- పగలు వీధి లైట్లు వెలగకుండా చూడడం. శీతాకాలంలో సాయంత్రం 6.00 నుండి ఉదయం 6.30 వరకు, ఇతర సమయాల్లో సాయంత్రం 7.00 నుండి ఉదయం 5.30 వరకు

నిధుల వినియోగం:

- కేంద్ర ఆర్థిక సంఘం నిధులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కూడ జమచేసి, ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేస్తాయి. ప్రతీ నెల రూ.339 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు నిధులు వస్తాయి
- వీటితో పాటు గ్రామ పంచాయతీ స్వీయ ఆదాయం, నరేగా నిధులు కూడా గ్రామ పంచాయతీలకు అందుబాటులో ఉంటాయి
- గ్రామ పంచాయతీ బడ్జెట్ లో పది శాతం నిధులను పచ్చదనం పెంచే కార్యక్రమాల కోసం కేటాయించాలి
- అప్పులు చెల్లించడం, జీతాలు చెల్లించడం లాంటి వాటితో పాటు విద్యుత్ బిల్లులు చెల్లింపును కూడా తప్పనిసరి చేయాల్సిన చెల్లింపుల జాబితాలో (చార్జ్ డ్ అకౌంట్) చేర్చాలి
- వార్షిక ప్రణాళిక, పంచవర్ష ప్రణాళికకు అనుగుణంగానే నిధులు ఖర్చు చేయాలి

3న విస్తృత స్థాయి సమావేశం:

- గ్రామాల్లో అమలు చేయాల్సిన ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికపై క్షేత్ర స్థాయిలో పనిచేసే అధికారులకు మార్గదర్శకం చేసేందుకు సెప్టెంబర్ 3న హైదరాబాద్ లోని తెలంగాణ అకాడమీ ఫర్ రూరల్ డెవలప్మెంట్ లో విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. మంత్రులు, రాష్ట్ర స్థాయి అధికారులు, కలెక్టర్లతో పాటు డిఎఫ్ఓలు, జడ్పీ సిఇవోలు, ఎంపిడివోలు, డిపివోలు, డిఎల్పీవోలు, ఎంపివోలను ఆ సమావేశానికి ఆహ్వానించారు. మద్యాహ్న భోజనం తర్వాత 2 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది

- సెప్టెంబర్ 4న అన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సమావేశం జరుగుతుంది. గ్రామాల్లో 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుచేసే అధికారులతో సమావేశమై కలెక్టర్లు తగు సూచనలు చేస్తారు
- మొత్తం కార్యక్రమం కలెక్టర్ల పర్యవేక్షణలో జరుగుతుంది

సఫాయి కర్మచారులకు నెలకు రూ.8,500 వేతనం:

రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలలో కలిపి 36వేల మంది సఫాయి కర్మచారులు పనిచేస్తున్నారు. ఆయా గ్రామ పంచాయతీ ఆర్థిక పరిస్థితిని బట్టి రూ.1,000 నుంచి రూ.5,000 వరకు వేతనంతో వారు జీవితం వెళ్లదీస్తున్నారు. గ్రామ పంచాయతీ బాధ్యతలు నిర్వహించడంతోపాటు మరో పని వెతుక్కోవాల్సి వస్తున్నది. వీరి దీనస్థితిని అర్థం చేసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ సఫాయి కర్మచారుల వేతనాలను రూ.8,500కు పెంచాలని నిర్ణయించారు. సఫాయి కర్మచారులు ఇకపై పూర్తి సమయం గ్రామ పంచాయతీ విధులకే కేటాయించాల్సి ఉంటుంది.

‘‘దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 72 సంవత్సరాలు గడిచినా గ్రామాల్లో పరిస్థితి ఇంకా దుర్భరంగానే ఉంది. మన ఊరును మనమే బాగు చేసుకోవాలనే స్పృహ రావాలి. చేయగలిగి చేయకుంటే నేరం అవుతుంది. ఏ ఊరు ప్రజలు ఆ ఊరుకు కథానాయకులు కావాలి. ఊరు పరిస్థితిని మార్చుకోవాలి. పనిచేసే గ్రామ పంచాయతీ వ్యవస్థను తయారు చేయడం కోసమే కొత్త పంచాయతీ రాజ్ చట్టం వచ్చింది. పంచాయతీ రాజ్ వ్యవస్థలో గ్రామ కార్యదర్శి నుంచి జిల్లా పరిషత్ సిఇవో వరకు అన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నాం. కావాల్సినన్ని నిధులను విడుదల చేస్తున్నాం. అధికారులు, ప్రజా ప్రతినిధుల బాధ్యతలను స్పష్టంగా చట్టం పేర్కొన్నది. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కూడా చట్టం కల్పించింది. చాలా ముఖ్యమైన పనులను ప్రభుత్వమే తన యంత్రాంగం ద్వారా నేరుగా చేస్తున్నది. గ్రామంలో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, పన్నులు వసూలు చేయడం లాంటి బాధ్యతలు గ్రామ పంచాయతీలు నెరవేర్చాల్సి ఉంది. గ్రామాల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల సహకారం కూడా కావాలి. 30 రోజుల ప్రత్యేక కార్యాచరణతో కలిసి పనిచేసి గ్రామాలను మార్చుకునే సంస్కృతి అలవాటు కావాలి’’ అని ముఖ్యమంత్రి అన్నారు.

More Press Releases