ప్రభుత్వం త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుంది: తెలంగాణ మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వరంలో కోట్లాది రూపాయలతో అనేక కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి అవి అమలు అవుతున్న తీరును పర్యవేక్షించాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.

సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల ఆధ్వరంలో చేపట్టిన కార్యక్రమాలపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, TSLDA CEO మంజువాణి, విజయ డెయిరీ MD శ్రీనివాస్ రావు, మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ శంకర్ రాథోడ్, TSCOF GM శ్రీనివాస్ ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయనుందని, ఆయా శాఖలలోని ఖాళీల వివరాలను సమర్పించాలని పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రను ఆదేశించారు. జీవాల వద్దకే వైద్యసేవలు తీసుకెళ్లాలనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆలోచనల మేరకు సంచార పశువైద్యశాలల సేవలను ప్రారంభించినట్లు వివరించారు. పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ కార్యాలయ అధికారులు వారంలో ఒక రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి సంచార పశువైద్యశాలల సేవలు సక్రమంగా అందుతున్నాయా? లేదా? రైతులను సంప్రదించి పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్నారు.

ఇప్పటికే పలు పిర్యాదులు రైతుల నుండి వస్తున్నాయని, సమస్యల పరిష్కారానికి, మెరుగైన సేవల కోసం త్వరలోనే GVK ప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. అంతేకాకుండా ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా ప్రతి సంవత్సరం జీవాలకు అవసరమైన వివిధ రకాల మందులను కొనుగోలు చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని, ఇవే కాకుండా రైతుల నుండి అధికంగా డిమాండ్ ఉండే మందుల వివరాలను కూడా సేకరించి ఆ మందులను కూడా సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్రను ఆదేశించారు.

రాష్ట్రంలోని పశువులకు లంపీ స్కిన్ వ్యాధి ప్రభలగా, వీటి నివారణ కు ప్రభుత్వం 4 కోట్ల రూపాయలను ఖర్చు చేసి గోట్ పాక్స్ వ్యాక్సిన్ ను వేయడం పశువైద్య శిభిరాలను నిర్వహించడం ద్వారా అదుపులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. వివిధ వ్యాధుల భారి నుండి జీవాలను రక్షించేందుకు ప్రభుత్వం ఉచితంగా వేసే టీకాలు, నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని, నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వరంలో అమలు అవుతున్న పథకాలపై కూడా పర్యవేక్షణ జరపాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు.

నాణ్యమైన పశు సంపదను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన కృత్రిమ గర్భధారణ కార్యక్రమం నిర్వహణలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. కంసాన్ పల్లిలో నిర్మిస్తున్న పశు వీర్య ఉత్పత్తి కేంద్రాన్ని జనవరి నాటికి ప్రారంభించేలా పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని మత్స్యకారుల అభివృద్దిని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేపపిల్లలు, రొయ్య పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహించాలని మత్స్య శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. మన రాష్ట్ర అవసరాలకు సరిపడా చేప పిల్లలను ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేయకుండా మన రాష్ట్రంలోనే అందుబాటులో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకొని ఉత్పత్తి చేసుకునేలా తగు ప్రణాళికలను రూపొందించాలని, అవసరమైతే ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే విషయాలను పరిశీలించాలని ఆదేశించారు.

ప్రజల వద్దకే వెళ్ళి చేపల విక్రయాలు జరిపే విధంగా GHMC పరిధిలోని 150 డివిజన్ లకు డివిజన్ కు ఒకటి చొప్పున మొబైల్ ఫిష్ ఔట్ లను త్వరలోనే ప్రారంభించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వివరించారు. ఇందుకోసం అర్హులైన వారి నుండి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. ఎంతో ప్రజాదరణ కలిగిన విజయ డెయిరీ ఉత్పత్తులను ప్రజలకు మరింత చేరువ చేసే ఉద్దేశంతోనే నూతన ఔట్ లెట్ లను పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే నష్టాలలో ఉన్న విజయ డెయిరీ నేడు లాభాల బాట పట్టిందని చెప్పారు. గతంలో 208 గా ఉన్న ఔట్ లెట్ ల సంఖ్య ప్రస్తుతం 340 కి పెరిగాయని, ఇవి ఇంకా మరిన్ని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని డైరీ MD శ్రీనివాస్ రావును మంత్రి ఆదేశించారు.

ప్రైవేట్ డైరీలకు దీటుగా విజయ డెయిరీ ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు విస్తృతమైన చర్యలను చేపట్టాలని చెప్పారు. డెయిరీకి పాలు విక్రయిస్తున్న రైతులకు లీటర్ పాలకు 4 రూపాయల నగదు ప్రోత్సాహకాన్ని ప్రస్తుతం ప్రభుత్వం చెల్లిస్తుందని, దానిని డెయిరీ నుండి చెల్లించే స్థాయికి అభివృద్దిని సాధించేలా కృషి చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రస్తుతం విజయ డెయిరీలో వినియోగిస్తున్న అద్దె వాహనాల కారణంగా తరచూ అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటి స్థానంలో విజయ డెయిరీ సంస్థ ఆధ్వరంలో వాహనాలను కొనుగోలు చేసే అంశాలకు సంబంధించి సమగ్ర నివేదిక రూపొందించి అందజేయాలని మంత్రి MD శ్రీనివాస్ రావును ఆదేశించారు.

ఈ నెల 19 వ తేదీన విజయవాడలో తెలంగాణ విజయ డెయిరీ పాల విక్రయాలను ప్రారంభించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అదే విధంగా విజయ డెయిరీ ఆధ్వరంలో ఖమ్మంలో మెగా ఉచిత పశువైద్య శిభిరం, లబ్దిదారులకు పాడి గేదెల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా జనవరి 26 న విజయ బ్రాండ్ ఐస్ క్రీం ఉత్పత్తులను ఆవిష్కరించడం జరుగుతుందని చెప్పారు. రాష్ట్ర మత్స్య శాఖకు కేంద్ర ప్రభుత్వం నుండి లభించిన అవార్డు, ప్రశంసా పత్రాన్ని ఈ సందర్బంగా మంత్రికి కార్యదర్శి అనిత రాజేంద్ర చూపించారు. అనంతరం గాలి కుంటు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం పోస్టర్లు, కరపత్రాలను మంత్రి ఆవిష్కరించారు.

More Press Releases