సర్పాల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Related image

  • పర్యావరణ పరిరక్షణతోనే జీవరాశుల మనుగడ
హైదరాబాద్, జూన్ 5: జీవకోటి మనుగడకు జీవనాధారమైన పర్యావరణాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.‌ బౌరంపేట రిజర్వు ఫారెస్ట్ లో రూ.1.40 కోట్ల వ్య‌యంలో ఏర్పాటు చేసిన సర్పాల సంరక్షణ, పునరావాస కేంద్రాన్ని శుక్రవారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి  ప్రారంభించారు.

అనంత‌రం  ఆయన మాట్లాడుతూ.. ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. పర్యావరణాన్ని కాపాడ‌టం ప్రతి ఒక్కరి భాద్యత అని తెలిపారు. జీవవైవిధ్యంలో అనేక జీవరాశుల మనుగడకు పర్యావరణ సమతుల్యతలే ప్రధానంగా తోడ్పడుతాయన్నారు. ఒక జీవి మనుగడ మరో జీవి మనుగడకు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఉపయోగ పడటం వల్లనే సకల జీవులు మానవాళిలో మనుగడ సాగిస్తున్నాయన్నారు. జీవ‌వైవిధ్య  చక్రంలో ఒక బంధం తెగితే దాని ప్రభావం అనేక రూపాల్లో కనిపిస్తాయని, పాములు నాశనమైతే ఎలుకలు, క్రిమి కీటకాలు సంతతి అనుహ్యంగా పెరిగిపోతుందని చెప్పారు. దానితో అవి పంటలపై పడి తిండి గింజలను తినేస్తాయని అందుకే సృష్టిలోని ఏజాతి ఉనికైనా జీవ వైవిధ్యం ఎంతో అవసరమ‌న్నారు. జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో భాగంగా చెన్నైలోని గిండి స్నేక్ పార్క్ కు ధీటుగా స‌ర్పాల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశార‌న్నారు.

రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ కేంద్రంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టుకున్న సర్పాల సంరక్షణ, అలాగే వివిధ రకాల సర్పాల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇది ఎంతగానో ఉయోగపడుతుందని తెలిపారు. ఎవరైకైనా పాములు కనిపిస్తే, వాటికి హాని తలపెట్టకుండా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ (రెస్క్యూ టీం) వారికి సమాచారం ఇవ్వాల్సిందిగా కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీఎఫ్  (HoFF) ఆర్. శోభ, పీసీసీఎఫ్ మునీంద్ర‌, మేడ్చ‌ల్ జిల్లా క‌లెక్ట‌ర్ వెంక‌టేశ్వ‌ర్లు, అద‌న‌పు పీసీసీఎఫ్ లు చంద్ర‌శేఖ‌ర్ రెడ్డి, కుక్రేటి, మేడ్చ‌ల్ డీఎఫ్ వో సుధాక‌ర్ రెడ్డి, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.
నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ వెబ్ సైట్ ను ఆవిష్క‌రించిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి:హైదరాబాద్, జూన్ 5 : నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్  వెబ్ సైట్, నెహ్రూ జూ పార్క్(Nehru Zoo Park) మొబైల్ అప్ ను అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆవిష్కరించారు. నెహ్రూ జూలాజిక‌ల్ పార్క్ కు సంబంధించిన స‌మ‌గ్ర స‌మాచారాన్ని ఇందులో పొందుప‌రిచార‌ని, జంతు ప్రేమికులు కూడా జంతువుల దత్తత వివ‌రాలను ఈ వెబ్ సైట్ (www.nehruzoopark.in) ద్వారా తెలుసుకోవ‌చ్చ‌ని మంత్రి తెలిపారు.

సంద‌ర్శ‌కులు ఆన్ లైన్ లో త‌మ జూ పార్క్ ప్ర‌వేశ‌ టిక్కెట్లతో పాటు ఇత‌ర సేవ‌ల‌ను బుక్ చేసుకోవ‌చ్చన్నారు. కోవిద్ - 19 లాక్ డౌన్ నేపథ్యంలో  సెంట్రల్ జూ అథారిటీ, రాష్ట్ర ప్రభుత్వం సంద‌ర్శ‌కుల‌కు అనుమతి ఇచ్చిన‌ తర్వాత అన్ లైన్ టికెట్ బుకింగ్ సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో పీసీసీఎఫ్  (HoFF) ఆర్. శోభ,  పీసీసీఎఫ్ స్వ‌ర్గం శ్రీనివాస్, అద‌న‌పు పీసీసీఎఫ్ లు డొబ్రియ‌ల్, కుక్రేటి, జూ క్యూరేట‌ర్ క్షితిజ‌, త‌దిత‌రులు పాల్గొన్నారు.

More Press Releases