నీరా కేంద్రం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

Related image

హైదరాబాద్: రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లో నెక్లెస్ రోడ్ లో ఏర్పాటు చేస్తున్న నీరా కేంద్రం ప్రతిపాదిత స్థలాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యటకాభివృద్ధి సంస్థ ఎండీ మనోహర్, పర్యాటక శాఖ ఉన్నతాధికారులు, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్ రావు గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు గీత వృత్తిదారుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా నీరా పాలసీని ప్రవేశ పెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో చేతి వృత్తులు, కుల వృత్తులకు పూర్వ వైభవం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే రజక, నాయి బ్రాహ్మణులు, యాదవ, ముదిరాజుల సోదరులకు ఇప్పటికే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తూ వెనుకబడిన వర్గాల ఆత్మ గౌరవం కోసం కృషి చేస్తున్నారన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

తెలంగాణ రాష్ట్రంలో గీత వృత్తి ఎన్నో వందల సంవత్సరాలు చరిత్ర ఉందన్నారు. రాష్ట్రంలో గీత వృత్తి ద్వారా సుమారు 4 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా 40 లక్షల మంది కల్లు, నీరా ప్రాజెక్టు వల్ల ఉపాధి పొందుతున్నారన్నారు. గత ఉమ్మడి రాష్ట్రంలో గీత వృత్తిపై, కల్లు అమ్మకాలపై ఎన్నో ఆంక్షలను విధించారన్నారు. కల్లును నిషేదించే కుట్రలు జరిగాయన్నారు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కేసీఆర్ కల్లు అమ్మకాలకు అనుమతి ఇవ్వటంతో పాటు గీత వృత్తిదారులు తాటి చెట్లు ఎక్కే క్రమంలో ప్రమాదానికి గురైతే 2 లక్షల నుండి 5 లక్షల రూపాయల వరకు ఎక్సిగ్రేషియోను పెంచి గౌడ కుటుంబాలకు అండగా నిలిచారన్నారు. గతంలో ఉన్న 10 కోట్ల బకాయిలను రద్దు చేయటంతో పాటు తాటి, ఈత చెట్ల పన్నును పూర్తిగా రద్దు చేసిన ఘనత సీఎం కేసీఆర్ కు దక్కిందన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

హైదరాబాద్ నగరం నడి బొడ్డున ఉన్న ఎంతో విలువైన నెక్లెస్ రోడ్డు లో నీరా కేంద్రం ఏర్పాటుకు 3 కోట్ల రూపాయలతో ఇప్పటికే టెండర్లు పూర్తి చేశామన్నారు. త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్నారు. ఔషద గుణాలున్న నీరాను శీతల పానీయంగా తయారు చేసి అందుకుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆధునిక హంగులతో కార్పొరేట్ తరహాలో నిర్మిస్తున్న ఈ నీరా కేంద్రంలో నీరా సరఫరాతో పాటు తాటి, ఈత చెట్ల ద్వారా తయారైన సంప్రదాయ ఉత్పత్తులను, ఔషధాలతో పాటు వెజ్, నాన్ వెజ్ లతో కూడిన తెలంగాణ సంప్రదాయ వంటకాలను అందిస్తామన్నారు.

ఆధునిక నీరా కేంద్రాలను దశల వారిగా రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేస్తామన్నారు. సంప్రదాయ నీరా ఉత్పత్తికి ప్రభుత్వం నుంచి గీత వృత్తి దారులకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. నీరా ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎన్నో వ్యాధుల నివారణకు దివ్య ఔషధంగా ఆయుర్వేదంలో వాడుతున్నారన్నారు. గీత వృత్తి దారుల సంక్షేమం, అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తున్నామన్నారు.

More Press Releases