80 శాతం మందిలో వైరస్ సోకినప్పటికీ 10 రోజులలో సాధారణంగా తగ్గుతుంది: వైద్య నిపుణులు

Related image

హైదరాబాద్: కరోనా వైరస్ పై ప్రజలలో అవగాహన కల్పించేందుకు సమాచార పౌరసంబంధాల శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైద్య నిపుణులు పాల్గొని మాట్లాడారు. కరోనా వైరస్ ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అని ఉస్మానియా జనరల్ ఆసుపత్రి అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు. దాదాపు 220 దేశాలలో వైరస్ వ్యాప్తి చెందిందన్నారు. 80 శాతం మందిలో వైరస్ సోకినప్పటికీ 10 రోజులలో సాధారణంగా తగ్గుతుందన్నారు. 5 శాతం మందిలో హైరిస్క్ కు దారి తీస్తుందన్నారు.

ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో వైరస్ వ్యాప్తి, మరణాల శాతం చాలా తక్కువగా ఉందన్నారు. లాక్ డౌన్ వలన వైరస్ వ్యాప్తి చాలా వరకు తగ్గించగలిగామని అన్నారు. భౌతిక దూరం పాటిస్తూ తరచుగా చేతులు కడుక్కుంటే వైరస్ వ్యాప్తిని చాలా వరకు తగ్గించవచ్చు అని అన్నారు. వాక్సిన్ ఇంకా ట్రయల్స్ దశలొనే ఉందని అందరూ జాగ్రత్తగా ఉండేందుకు కృషి చేయాలని సూచించారు.

హోలిస్టిక్ ఆసుపత్రి కన్సల్టెంట్ డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా ఇన్ఫెక్షన్ చాలా కంటేజియస్ గా ఉందన్నారు. లాక్ డౌన్ తర్వాత నార్మల్ లైఫ్ లోకి వచ్చేటప్పుడు జాగ్రత్తలు తప్పకుండా పాటించాలని సూచించారు. డయాబెటిస్, బీపీతో భాధపడే వారు విధిగా ఇంటిలోనే వుంటూ మానిటర్ చేసుకునేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. ఇంకా సమస్య కొనసాగితే డాక్టర్ ను సంప్రదించి తగు చర్యలు తీసుకోవాలన్నారు.

వీలయినంత వరకు టెలి మెడిసిన్ సౌకర్యాన్ని వినియోగించుకోవాలన్నారు. గర్భిణులు, చంటి పిల్లలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. డాక్టర్ సలహా లేకుండా ఎటువంటి మందులు వాడకూడదన్నారు. పని ప్రదేశాలలో తప్పకుండా భౌతిక దూరాన్ని పాటించాలన్నారు.అనవసరంగా గుంపులలోకి వెళ్లకూడదని ఆయన సూచించారు. ప్రభుత్వం ఇస్తున్న సూచనలు, సలహాలను విధిగా పాటిస్తూ వుంటూ ఆరోగ్యంగా ఉండాలన్నారు.

ఈ సమావేశంలో అడిషనల్ డైరెక్టర్ నాగయ్య కాంబ్లే, జాయింట్ డైరెక్టర్ జగన్, సీఐఇ విజయభాస్కరరెడ్డి, అసిస్టెంట్ డైరెక్టర్ యామిని తదితరులు పాల్గొన్నారు.

More Press Releases