పాల ఉత్పత్తుల తయారీ వద్ద కూడా తప్పనిసరిగా సిబ్బంది చేతులకు గ్లౌస్ లు, మాస్క్ లు ధరించాలి: మంత్రి తలసాని

Related image

రాజేంద్రనగర్ లో 240 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న మెగా డెయిరీ నిర్మాణంలో అత్యాధునిక మెషినరీని ఉపయోగించాలని తెలంగాణ పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు. అత్యాధునిక మెషినరీ కోసం ఇతర రాష్ట్రాలలో అవసరమైన అధ్యయనం చేయాలని సూచించారు. సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని పశుసంవర్ధక శాఖ కాన్ఫరెన్స్ హాల్ లో పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, విజయ డెయిరీ మేనేజింగ్ డైరెక్టర్  శ్రీనివాస రావు, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ లక్ష్మారెడ్డి లతో కలిసి లాక్ డౌన్ అమలు జరుగుతున్న సమయంలో పాలు, పాల ఉత్పత్తుల తయారీ, సరఫరా తదితర అంశాలపై సమీక్షించారు.

కరోనా నేపద్యంలో పాల సరఫరా, సేకరణలో అధికారులు, సిబ్బంది తగు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని గ్రామాల నుండి పాలు తీసుకొచ్చే వాహనాలకు కాని, పాలు, పాల ఉత్పత్తుల ను రవాణా చేసే వాహనాలకు కాని ఎక్కడ కూడా ఎలాంటి ఆటంకం కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. పాల ఉత్పత్తుల తయారీ వద్ద కూడా తప్పని సరిగా సిబ్బంది చేతులకు గ్లౌస్ లు, మాస్క్ లు ధరించాలని, వాహనాలను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలని ఆదేశించారు. రోజురోజుకు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందుతుందని, మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అద్బుతమైన ప్యాకింగ్, మరింత నాణ్యమైన ఉత్పత్తులతో ప్రజలను ఆకర్షించాలని వివరించారు. అదే విధంగా డెయిరీ పాళీ టెక్నిక్ కళాశాల ఏర్పాటుకు కూడా అవసరమైన చర్యలను తీసుకోవాలని ఆదేశించారు.

రానున్న 2 సంవత్సరాలలో విజయ ఉత్పత్తులు ప్రజలలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలలో విజయ డెయిరీ ఉత్పత్తులను ఉపయోగించేలా ప్రభుత్వం నుండి త్వరలోనే ఆదేశాలు జారీ చేయిస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం పాడి రైతులకు ఇస్త్తున్న 4 రూపాయల ఇన్సెంటివ్ ను విజయ డెయిరీ చెల్లించే స్థాయికి అభివృద్దిని సాధించాలని ఆకాంక్షించారు. ప్రత్యేక అధికారులను నియమించిన తర్వాత సుమారు 35 వేల లీటర్ల పాల సేకరణ పెరిగిందని అన్నారు. పాల సేకరణ కేంద్రాల వద్ద తప్పని సరిగా పాల నాణ్యత ను పరిశీలించే ఎనలైజర్ అందుబాటులో ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

నాణ్యత పాటించడం వల్లనే విజయ బ్రాండ్ ఉత్పత్తులకు ప్రజలలో ఎంతో ఆదరణ ఉందన్నారు. ప్రతి గ్రామం, పట్టణం, పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ దేవాలయాల వద్ద విజయ డెయిరీ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడం వలన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా మన ఉత్పత్తుల విక్రయాలను పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. లాక్ డౌన్ సమయంలో వినియోగదారులకు పాలు, పాల ఉత్పత్తులను అందుబాటులోకి తెచ్చేందుకు మహబూబ్ నగర్, ఖమ్మం, సంగారెడ్డి, జనగాం, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వరంగల్, మెదక్ జిల్లాలలోని రైతు బజార్ లలో మొబైల్ పార్లర్ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఖమ్మం, ఆదిలాబాద్, నిర్మల్, వరంగల్, మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల లోని కంటైన్మెంట్ జోన్ లలో స్థానిక అధికారుల సహకారంతో డోర్ డెలివరీ చేయడం జరిగిందని మంత్రి వివరించారు.

పశుసంవర్ధక శాఖ ముందు చూపుతో  ప్రణాళికా బద్దంగా వ్యవరించడం వలన వేసవి కాలంలో సైతం పశుగ్రాసం కొరత లేకుండా చూడగలిగామని మంత్రి అన్నారు. తెలంగాణ ఏర్పడక ముందు పెద్దగా ప్రాధాన్యత, నిధుల కేటాయింపు లేని పశుసంవర్ధక శాఖకు తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన అనంతరం ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధతో ఈ శాఖ కు పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం అనేక కార్యక్రమాలు చేపట్టడం వలన ఇప్పుడు ఎంతో ప్రాధాన్యత కలిగిన శాఖగా గుర్తింపు సాధించిందని, ఇది అందరి సహకారంతోనే సాధ్యమైందని మంత్రి వివరించారు.

ప్రమోషన్లు కల్పించాలని మంత్రికి వినతి:

పశుసంవర్ధక శాఖ లో ఎంతో కాలంగా వెటర్నరీ సర్జన్ లుగా సేవలు అందిస్తున్న తమకు అసిస్టెంట్ సర్జన్ లుగా పదోన్నతి కల్పించాలని కోరుతూ  వెటర్నరీ సర్జన్ అసోసియేషన్ రాష్ట్ర ప్రతినిధులు సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని కార్యాలయంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, పశుసంవర్డక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర లకు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం లాక్ డౌన్ ఉన్నందున ముగిసిన అనంతరం నిబందనల ప్రకారం ప్రమోషన్ ల ప్రక్రియ చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వినతిపత్రం అందజేసిన వారిలో అధ్యక్షులు దేవేందర్, అసోసియేట్ అధ్యక్షులు నాగరాజ్ యాదవ్, అరవింద్ రెడ్డి వైస్ ప్రెసిడెంట్, జాయింట్ సెక్రెటరీ ధీరజ్ తదితరులు ఉన్నారు.

More Press Releases