శ్రీరామనవమి వేడుక‌లను ఘనంగా నిర్వహించాలి: తెలంగాణ మంత్రి అల్లోల‌

Related image

  • స‌కాలంలో ప‌నులు పూర్తి చేయండి

  • భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి

  • శ్రీరామనవమి ఏర్పాట్లపై తెలంగాణ మంత్రి సమీక్ష

శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించే భ‌ద్రాద్రి శ్రీ సీతారాముల కల్యాణ వేడుక‌ల‌ను విజయవంతం చేసేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు. ఏప్రిల్ 2న‌ భద్రాద్రిలో శ్రీ సీతారాముల కల్యాణం వైభవోపేతంగా నిర్వహించేందుకు సన్నద్ధం కావాలన్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం స‌కాలంలో ఏర్పాట్లు పూర్తి  చేయాలన్నారు.

శుక్ర‌వారం అరణ్య భ‌వ‌న్ లోని ఆయ‌న‌ చాంబ‌ర్ లో దేవాదాయ శాఖ ఉన్న‌తాధికారుల‌తో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సందర్భంగా అధికారుల‌ను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ.. ఈ నెల 25 నుంచి ఏప్రిల్ 8 వ‌ర‌కు జరిగే బ్రహ్మోత్సవాలను ఏర్పాట్లు ఘనంగా నిర్వహించాలని, ఆ దిశగా అన్నిశాఖల అధికారులు సమన్వయంతో కలిసి పని చేయాలన్నారు. ఈసారి భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఏర్పాట్లలో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కావద్దన్నారు.

ముఖ్యంగా పారిశుద్ధ్యం కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. భ‌క్తుల‌కు తాగునీటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని, మెడికల్ క్యాంప్‌ల ఏర్పాటుకు త‌గు చర్యలు తీసుకోవాలన్నారు. ఉత్సవాలప్పుడు వాహనాల పార్కింగ్ ప్రధాన సమస్యగా ఉంటుంద‌ని... పార్కింగ్ ఇబ్బందులు లేకుండా జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని సూచించారు. కల్యాణవేదిక వద్ద సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు మరింత పకడ్బందీగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విధానంలో జిల్లా పోలీసు, రెవెన్యూ యంత్రాంగంతో సమన్వయం చేసుకుని పక్కా ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు.

ఏప్రిల్ 1న ఎదుర్కోలు ఉత్స‌వం, 2 క‌ళ్యాణ మ‌హోత్స‌వం, 3న మ‌హా ప‌ట్టాభిషేకం ఉంటుంద‌ని అధికారులు వివ‌రించారు. ఈ స‌మావేశానికి దేవాదాయ శాఖ క‌మిష‌న‌ర్ అనిల్ కుమార్, అద‌న‌పు క‌మిష‌న‌ర్ శ్రీనివాస‌రావు, ఈవో నర్సింహులు, ఇత‌ర అధికారులు హాజ‌ర‌య్యారు.

More Press Releases