ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం-పరిశుభ్రత: మంత్రి అల్లోల‌

Related image

ఆసిఫాబాద్, ఫిబ్ర‌వ‌రి 24: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్నప‌ట్ట‌ణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యంతోనే పచ్చదనం-పరిశుభ్రత విజయవంతమవుతుందని తెలంగాణ అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. సోమ‌వారం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి సమీక్షా సమావేశంలో పాల్గొని అధికారులకు మంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని గ్రామాలు, ప‌ట్ట‌ణాల  రూపురేఖలు మార్చడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మార్గదర్శనంలో ప‌ల్లె,పట్టణ ప్రగతి కార్యక్రమాలు రూపుదిద్దుకున్నాయ‌న్నారు.

పట్టణ ప్రగతి లో ప్రజల భాగస్వామ్యం కీలకమ‌ని, మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి వార్డుకు సంబంధించి ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని తెలిపారు. కౌన్సిలర్లు తమ వార్డుల్లో చేపట్టనున్న పనులను ఎప్పటికప్పుడు సమీక్షించుకొని, ముందుకెళ్లాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన పనులను షెడ్యూల్‌ ప్రకారం నిర్వహించాలన్నారు. హరితహారం, పారిశుధ్యం, విద్యుత్‌ సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు. శ్మశానవాటికలు, పార్కుల ఏర్పాటు, అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప‌, జ‌డ్పీ చైర్ ప‌ర్స‌న్ కోవా ల‌క్ష్మి, ఆసిఫాబాద్ క‌లెక్ట‌ర్ సందీప్ కుమార్ ఝా , తదిత‌రులు పాల్గొన్నారు.

More Press Releases