‘జయ జయ రామ’ను ఆవిష్కరించడం నా అదృష్టం: నాగబాబు

శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటుడు, శాసనమండలి సభ్యుడు, జనసేన కార్యదర్శి కొణిదెల నాగబాబు అన్నారు. శ్రీరామనవమి సందర్భంగా పిఠాపురం జనసేన కార్యాలయంలో ఆదివారం ఉదయం ప్రముఖ రచయిత శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం ‘జయ జయ రామ’ గ్రంథాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కి, చిరంజీవికి , తనకి ఆంజనేయుడంటే ఎంతో ఇష్టమని, ఆంజనేయుడికి రామచంద్రుడంటే ఎనలేని భక్తి అని, అలాంటి శ్రీరామచంద్రుడి గ్రంథాన్ని ఆవిష్కరించడం ఎంతో అదృష్టమని చెప్పారు. జంటనగరాలలో దాదాపుగా సినీ ప్రముఖులందరి ఇళ్లలో పురాణపండ శ్రీనివాస్ అద్భుత గ్రంథాలే ఉంటాయని నాగబాబు పేర్కొన్నారు.
గ్రంథ సమర్పకులు జనసేన పిఠాపురం ఇంచార్జి మర్రెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ... ఈ పవిత్ర కార్యం చేయడానికి కారకులైన ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్, కిమ్స్ హాస్పిటల్ చైర్మన్ బొల్లినేని కృష్ణయ్య , ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్, నాగబాబులకు మనసారా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టౌన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వేములపాటి అజేయ కుమార్ , గన్నవరం శాసనసభ్యుడు గిడ్డి సత్యనారాయణ , కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ తుమ్మల బాబు తదితరులు పాల్గొన్నారు.