బ్రహ్మానందంకు నేను బ్రాండ్ అంబాసిడర్గా ఉండి ప్రమోట్ చేశాను: చిరంజీవి

బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం 'బ్రహ్మా ఆనందం'. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. Rvs నిఖిల్ దర్శకుడు. రాహుల్ యాదవ్ నక్కా ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. ఈ క్రమంలో మంగళవారం నాడు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. నాగ్ అశ్విన్, అనిల్ రావిపూడి వంటి దర్శకులు ఈ కార్యక్రమంలో సందడి చేశారు. ఈ ఈవెంట్లో..
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ .. ‘ రాజా రవీంద్ర ఈ బ్రహ్మా ఆనందం సినిమా గురించి చెప్పాడు. హీరోలు దొరకడం లేదు.. ప్రమోషన్స్ కాస్త డల్గా ఉన్నాయ్ అని చెప్పాడు. నేను వస్తాను అని వెంటనే బ్రహ్మానందంకు ఫోన్ చేసి చెప్పాను. ప్రతీ దానికి, ప్రతీ చోటా చిరంజీవి కనిపిస్తున్నాడని అంతా అనుకున్నా సరే. నాకున్న ఇమేజ్, గుడ్ విల్ వాడి ఇతర సినిమాల్ని ప్రమోట్ చేస్తాను. బ్రహ్మానందం తన కొడుకుతో కలిసి చేసిన ఈ బ్రహ్మా ఆనందం మూవీని అందరూ ఆదరించాలి. ఈ మూవీని తీసిన నిఖిల్, నిర్మాత రాహుల్కు ఆల్ ది బెస్ట్. రఘు బాబు, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల వంటి వారు నటించడంతో పరిపూర్ణత చేకూరినట్టు అయింది. ప్రియ, ఐశ్వర్య, దివిజలకు ఆల్ ది బెస్ట్. ఇలాంటి చిత్రాలను ఆదరించండి. ఇలాంటి వేడుకకు నన్ను పిలిచిన నా సోల్ మేట్ బ్రహ్మానందంకు థాంక్స్. ఫిబ్రవరి 14న ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. నీకు (బ్రహ్మానందం) పుత్రోత్సాహం కలుగుతుంది. నేను ఎలాగైతే పుత్రోత్సాహాన్ని పొందుతున్నానో.. నువ్వు (బ్రహ్మానందం) కూడా అంతే పుత్రోత్సాహాన్ని పొందుతావు’ అని అన్నారు.
బ్రహ్మానందం మాట్లాడుతూ .. ‘నిర్మాత రాహుల్కు ఎంతో ప్యాషన్ ఉంది. సినిమాను ఎలా తీయాలా? అని నిత్యం ఆలోచిస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తులతో పని చేయడం నాకు గర్వంగా అనిపిస్తోంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మాట్లాడే అర్హత నాకు మాత్రమే ఉంది. నాలుగు దశాబ్దాలుగా పరిచయం ఉంది. ఆయన చూడని చరిత్రా.. తెలియని చరిత్రా.. ఆయన కింగ్ ఆఫ్ వరల్డ్ ఫిల్మ్. రగులుతోంది మొగలిపొద సాంగ్ను చూస్తే ఆయన బాడీ స్ప్రింగులా అనిపిస్తుంది. కొరియోగ్రాఫర్లు సైతం కొత్తగా ఏం చేయించాలా? అని కంగారు పడేవారు. చిరంజీవి గారిని పదే పదే పిలుస్తున్నాను కదా.. బాగుంటుందా? లేదా? అని అనుకున్నాను. రాజా రవీంద్రతో అదే మాట అన్నాను. ఆ మాట చిరంజీవి గారికి చెప్పాడు. వెంటనే నాకు ఫోన్ చేశాడు. ఏరా.. నన్ను పిలవడానికి వెనుకాముందు ఆడుతున్నావ్ అని అన్నారు. రాజా గౌతమ్ నాకూ బిడ్డ లాంటివాడే.. టైం, డేట్ చెప్పు.. నేను వస్తాను అని అన్నారు. ఆయన నిజంగానే భోళా శంకరుడు. హద్దులు లేనటువంటి వారే చిరంజీవి. నన్ను చేయి పట్టుకుని విమానం ఎక్కించుకుని తీసుకొచ్చారు. ఇప్పుడు నా బిడ్డని ఈ విమానం ఎక్కిస్తున్నారు. ఈ మూవీని చూశాను. చాలా అద్భతుంగా ఉంది. ఫిబ్రవరి 14న ఈ చిత్రం రాబోతోంది’ అని అన్నారు.
రాజా గౌతమ్ మాట్లాడుతూ ..‘మా కోసం వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారు, అనిల్ రావిపూడి గారు, నాగ్ అశ్విన్ గారికి థాంక్స్. నాకు చిన్నప్పటి నుంచి హీరో అంటే తెలిసింది చిరంజీవి గారు. ఇంద్రలో వేసిన చిరంజీవి గారు వేసిన స్టెప్ని నాన్న ముందుగానే చూశారు. ఇంట్లో మా నాన్న గారు వర్షంలో ఆ స్టెప్పులు వేస్తున్నారు. చిరంజీవి గారు అద్భుతంగా చేశారు అంటూ మా నాన్న గారు ఎంతో ఎగ్జయిటింగ్గా చెప్పారు. అన్ని వర్గాల వారిని, వయసుతో సంబంధం లేకుండా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. నాకు సపోర్ట్ చేసిన దర్శక, నిర్మాతలకు థాంక్స్. ఫిబ్రవరి 14న మా చిత్రాన్ని అందరూ చూసి సపోర్ట్ చేయండి’ అని అన్నారు.
వెన్నెల కిషోర్ మాట్లాడుతూ .. ‘మా సినిమా ఈవెంట్ కోసం వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్. బ్రహ్మా ఆనందం సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రియ, ఐశ్వర్య, దివిజ ఇలా అందరూ అద్భుతంగా నటించారు. రాజా గౌతమ్ నాకు వారెవ్వా సినిమాతో పరిచయం అయ్యాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచి స్నేహితులుగా మారిపోయాం. బ్రహ్మానందం గురించి చెప్పే స్థాయి నాకు లేదు. ఇందులో రాజీవ్ కనకాల గారు చివరి వరకు ఉంటారు. దాన్ని బట్టి ఈ సినిమాలో ఎలాంటి వయలెన్స్ ఉండదని అర్థం చేసుకోవచ్చు’ అని అన్నారు.
దర్శకుడు Rvs నిఖిల్ మాట్లాడుతూ .. ‘బ్రహ్మా ఆనందం ఈవెంట్కు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి థాంక్స్. ఇంద్ర, శంకర్ దాదా ఎంబీబీఎస్ టైంలో ఫస్ట్ టైం నాకు ట్రాఫిక్ జాం, తొక్కిసలాట అనేవి నాకు తెలిశాయి. చిరంజీవి గారి వల్లే తెలుగు సినిమా పైస్థాయికి వచ్చింది. బ్రహ్మానందం లాంటి గొప్ప నటుడితో నేను సినిమాను చేశాను. ఆయన లేకపోతే ఈ సినిమాను చేసేవాడ్ని కాదు. ఈ మూవీ ఇంత వరకు వచ్చేది కూడా కాదు. వెన్నెల కిషోర్ గారు, రాజీవ్ కనకాల గారు, సంపత్ గారు, రఘు బాబు గారు అద్భుతంగా నటించారు. రాజా గౌతమ్ గారు ఎక్స్ట్రీమ్ లెవెల్లో నటించారు. రాహుల్ గారు నాకు ఈ ప్రయాణంలో ఎప్పుడూ అండగా నిలబడ్డారు. నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.
నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా మాట్లాడుతూ.. ‘మెగాస్టార్ చిరంజీవి గారిని ఇంత దగ్గరి నుంచి చూస్తానని అనుకోలేదు. మా కోసం వచ్చిన నాగ్ అశ్విన్ గారు, అనిల్ రావిపూడి గారికి థాంక్స్. ఈ కథను బ్రహ్మానందం గారు ఓకే చెబితేనే చేద్దామని అనుకున్నాను. ఆయనకు కథను చెప్పాం. ఓకే అన్నారు. బ్రహ్మా ఆనందం అనే టైటిల్తో బ్రహ్మానందం గారితో సినిమా అనేది చాలా పెద్ద బాధ్యత అనిపించింది. రాజా గౌతమ్, వెన్నెల కిషోర్ గారు ఎంతగానో సపోర్ట్ చేశారు. నిఖిల్ ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. బ్రహ్మానందం కోసం థియేటర్కు వస్తారు.. కానీ రాజా గౌతమ్ను ఇంటికి తీసుకెళ్తారు’ అని అన్నారు.