పెద్దమ్మ తల్లికి శ్రీనివాస్ ' సహస్రం' ను సమర్పించిన బెల్లంకొండ సురేష్, పద్మావతి

ప్రముఖ సినీ నిర్మాత ,  శ్రీ సాయి గణేష్ ప్రొడక్షన్స్ అధినేత బెల్లంకొండ సురేష్ , ఆయన భార్య పద్మావతి దంపతుల సౌజన్యంతో భాగనగర ఇలవేల్పు జూబిలీహిల్స్  శ్రీ పెద్దమ్మ దేవాలయంలో ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారు పురాణపండ శ్రీనివాస్ అపురూప రచనా సంకలనం ' శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రం' 350 పేజీల దివ్యగ్రంథాన్ని పూజల్లో పాల్గొన్న  వందలమంది ముత్తయిదువులకు పెద్దమ్మ దేవాలయ  అర్చకులు, సిబ్బంది పంచిపెట్టారు.

తెలుగు రాష్ట్రాలలో నిస్వార్ధంగా ఆధ్యాత్మిక గ్రంధాల అద్భుత రచన, ప్రచురణ ,  వితరణలో  అగ్రస్థానంలో దూసుకుపోతున్న  ప్రఖ్యాత ధార్మిక ఆధ్యాత్మిక పవిత్ర ప్రచురణల సంస్థ 'జ్ఞాన మహా యజ్ఞ కేంద్రం'  పరమ ఋషుల పవిత్ర అంశాలతో అద్భుత విశేషాలతో , పురాణపండ రమణీయ వ్యాఖ్యానాలతో రూపొందించిన ఈ  మంత్రమయ  గ్రంధం ' శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రం ఇప్పటికే ఎందరో ధార్మిక సంస్థల, సౌజన్య పరుల ప్రోత్సాహంతో ప్రతుల వితరణ జరగడం అభినందనీయమని తిరుమల మహా క్షేత్ర ప్రధానార్చకుడు ఏ.వేణుగోపాల దీక్షితులు, తెలంగాణ రాష్ట్ర పూర్వ ప్రత్యేక సలహాదారు, సీనియర్ ఐఏఎస్ అధికారి కేవీ రమణాచారి ప్రశంసలు వర్షించడాన్ని దూరదర్శన్ పూర్వ డైరెక్టర్ వోలేటి పార్వతీశం ఇటీవల రవీంద్ర భారతి సభలో పురాణపండ  పవిత్ర సంకల్పదీక్ష , నిస్వార్ధ యజ్ఞ సేవ , ప్రతిభా సంపత్తిని  ఒక జెండాలా ఎగుర వేస్తున్నాయని పేర్కొనడం గమనార్హం .

దశాబ్దం క్రితం అత్యద్భుత చిత్రాల నిర్మాతగా , పదిమందికీ మేలు చేసి దైవ కార్యాలలో విస్తృతంగా పాల్గొనే బెల్లంకొండ సురేష్ ఇటువంటి ఉదాత్త కార్యాన్ని భుజాలకెత్తుకోవడాన్ని , ఉచితంగా ఈ భాద్రపదమాసంలో పంచడాన్ని భక్తులు, రసజ్ఞులు అభినందిస్తున్నారు.

ఎన్ని సంపదలున్నా ఇలాంటి దైవీయ అంశాల పుణ్యాలే చివరికి మనకు మిగుల్తాయని శ్రీ పెద్దమ్మ ఆలయంలో పుస్తకాలు  తీసుకున్న కొందరు సీనియర్  జర్నలిస్ట్ లు సైతం పురాణపండను, బెల్లంకొండను అభినందిస్తూ ఆలయం దాటారనడానికి అర్చకులు, ఆలయ సిబ్బందే సాక్షి.

ముఖ పత్రంపై తనకిష్టం ఉన్న శ్రీ నరసింహ స్వామి వారి గంభీర చిత్రాన్ని ఆకర్షణీయంగా శ్రీనివాస్ చేత ప్రచురింప చేసిన బెల్లంకొండ తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఈ దసరా నవరాత్రుల్లో అమ్మవారికి సంబంధించిన మరొక ఉత్తమ గ్రంధాన్ని బహూకరిస్తే సముచితంగా ఉంటుందని ఆయన సన్నిహితులే పేర్కొనడం  గమనార్హం. 

More Press News