Kondapalli Sreenivas: వితంతు మహిళలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ .. మంత్రి కీలక ప్రకటన

- కొత్త పింఛన్ల కోసం వేలాది మంది ఎదురుచూపులు
- కూటమి ప్రభుత్వం ఏర్పాటై 9 నెలలు అవుతున్నా కొత్త పింఛన్లు మంజూరు కాని వైనం
- 93వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్త పింఛన్లు ఇవ్వనున్నామన్న మంత్రి కొండపల్లి
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం సామాజిక భద్రతా పింఛన్ల మొత్తాన్ని పెంచడంతో, వేలాది మంది అర్హులు పింఛన్ల మంజూరు కోసం నిరీక్షిస్తున్నారు. ప్రజాప్రతినిధులకు అందుతున్న విజ్ఞప్తుల్లో పింఛను దరఖాస్తులే అధికంగా ఉంటున్నాయి.
చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు దాటినా, నూతన పింఛన్లు ఇంతవరకు మంజూరు కాలేదు. అనర్హుల తొలగింపు ప్రక్రియ మాత్రం కొనసాగుతోంది. దీంతో కొత్త పింఛన్లు మంజూరవుతాయనే ఆశతో ఎంతోమంది ఎదురుచూస్తున్నారు.
ఈ నేపథ్యంలో కొత్త పింఛన్ల మంజూరుకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం వెలువడింది. సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఈ మేరకు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో 93 వేల మంది వితంతువులకు మే నెల నుంచి కొత్తగా పింఛన్లు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు.
విజయనగరం జిల్లా గంట్యాడ గ్రామంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్రంలో కొత్తగా దాదాపు 5 లక్షల మంది పింఛన్లకు అర్హులుగా ఉన్నారని, వారందరికీ త్వరలోనే మంజూరు చేస్తామని ఆయన పేర్కొన్నారు.