Chandrababu Naidu: ముఖ్యమంత్రిని కలిసినప్పటి ఫోటో ఆధారంగా వెతికి... లక్ష రూపాయల చెక్కు అందజేసిన కలెక్టర్

- దివ్యాంగుడికి లక్ష ఆర్ధిక సాయం ప్రకటించిన సీఎం
- తల్లి విజ్ఞప్తికి తక్షణమే స్పందించిన చంద్రబాబు
- ఫోటో ఆధారంగా లబ్ధిదారుని గుర్తించిన అధికారులు
- చెక్కు అందజేసిన కలెక్టర్, జేసీ
- ఇంటి స్థలం, పింఛన్ మంజూరుకు హామీ
పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఇటీవల జరిగిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన సందర్భంగా ఒక దివ్యాంగుడికి ఆర్ధిక సహాయం అందించాలని ఆయన ఆదేశించారు. దువ్వ గ్రామానికి చెందిన నందివాడ ఏసమ్మ అనే మహిళ తన కుమారుడు దివ్యాంగుడని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ముఖ్యమంత్రికి విన్నవించుకున్నారు.
ఆమె విజ్ఞప్తికి స్పందించిన ముఖ్యమంత్రి, వెంటనే లక్ష రూపాయల ఆర్థిక సహాయం మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఏసమ్మ నుంచి ఎటువంటి దరఖాస్తు లేకపోయినా, ఆమె ముఖ్యమంత్రిని కలిసినప్పటి ఫోటో ఆధారంగా అధికారులు ఆమె వివరాలను సేకరించారు. భీమవరంలోని కలెక్టరేట్లో కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్ కుమార్ రెడ్డి గురువారం ఏసమ్మ, ఆమె కుమారుడికి లక్ష రూపాయల చెక్కును అందజేశారు.
ఈ సందర్భంగా ఏసమ్మ మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్ నాగరాణి స్పందిస్తూ, పింఛన్ మంజూరుతో పాటు ఇంటి స్థలం కేటాయించి, ఇల్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటామని ఏసమ్మకు హామీ ఇచ్చారు. 14 సంవత్సరాల క్రితం భర్తను కోల్పోయిన ఏసమ్మ, కుమారుడి అనారోగ్యంతో బాధపడుతూ జీవనం సాగిస్తున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి సహాయం ఆమెకు ఎంతో ఊరటనిచ్చింది.