Sunita Williams: సునీతా విలియమ్స్కు ఏపీ అసెంబ్లీ అభినందనలు

- సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భూమికి చేరుకున్న సునీత, బుచ్ విల్మోర్
- ఇద్దరు వ్యోమగాములకు అభినందనలు తెలిపిన ఏపీ అసెంబ్లీ
- వ్యోమగాముల జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకమన్న స్పీకర్
- అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు, పరిశోధనలపై ప్రశంసలు
తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అంతరిక్షం నుంచి భూమ్మీదకు చేరుకున్న భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, మరో వ్యోమగామి బుచ్ విల్మోర్లకు ఏపీ అసెంబ్లీ అభినందనలు తెలిపింది. ఇద్దరు వ్యోమగాములు పుడమికి సురక్షితంగా చేరుకోవడం ఆనందాయకమని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అన్నారు.
వ్యోమగాముల జీవితం మానవాళికి స్ఫూర్తిదాయకమని ప్రశంసించారు. అంతరిక్ష రంగంలో సునీత ప్రదర్శించిన ధైర్య సాహసాలు, ఆమె పరిశోధనలు ప్రశంసనీయమన్నారు.
కాగా, తొమ్మిది నెలల పాటు అంతరిక్షంలో చిక్కుకుపోయిన సునీతతో పాటు మరో ముగ్గురితో భూమికి బయల్దేరిన స్పేస్ ఎక్స్ క్రూ డ్రాగన్ బుధవారం తెల్లవారుజామున 3.27 గంటలకు ఫ్లోరిడా సముద్ర తీరంలో సురక్షితంగా ల్యాండ్ అయిన విషయం తెలిసిందే.