Mahendra Shah: గుజరాత్ లోని ఓ ఇంట్లో 100 కేజీల బంగారం పట్టివేత

- అక్రమ బంగారంపై గుజరాత్ ఏటీఎస్ పోలీసులు, డీఆర్ఐ అధికారుల సోదాలు
- వంద కోట్ల విలువైన బంగారం స్వాధీనం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
గుజరాత్లోని అహ్మదాబాద్లో భారీగా బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎస్, డీఆర్ఐ అధికారులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్లో ఒక ఇంటిలో అక్రమంగా నిల్వ చేసిన వంద కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ మార్కెట్లో సుమారు వంద కోట్ల రూపాయల వరకు ఉంటుందని అధికారులు తెలిపారు.
పెద్ద ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలించి ఒక అపార్ట్మెంట్లో దాచి ఉంచారన్న సమాచారంతో ఏటీఎస్ పోలీసులు, డీఆర్ఐ అధికారులు పాల్ది ప్రాంతంలోని అవిష్కార్ అపార్ట్మెంట్లో సోదాలు నిర్వహించారు. ఈ సోదాలో 88 కేజీల బంగారు కడ్డీలు, 19.66 కిలోల బంగారు ఆభరణాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ బంగారం స్టాక్ మార్కెట్ ఆపరేటర్ మహేంద్ర షాకు చెందినదిగా పోలీసులు భావిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ బంగారంలో ఎక్కువ భాగం విదేశాల నుంచి అక్రమంగా తరలించి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.