israel - Hamas: గాజాపై ఇజ్రాయెల్ దాడి .. 130 మందికిపైగా మృతి

- గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులు
- ఇటీవలే ముగిసిన కాల్పుల విరమణ తొలి ఒప్పందం
- కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించేందుకు అంగీకరించని హమాస్
ఇజ్రాయెల్ – హమాస్ల మధ్య మరోసారి ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గాజాపై టెల్అవీవ్ వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇందులో 130 మందికి పైగా మృతి చెందినట్లు సమాచారం. కాల్పుల విరమణ చర్చలు నిలిచిపోయిన నేపథ్యంలో గాజాలోని హమాస్ లక్ష్యంగా ఐడీఎఫ్, ఐఎస్ఏ దాడులు చేస్తోందని ఇజ్రాయెల్ తెలిపింది.
కాల్పుల విరమణ ఒప్పందం కొనసాగించుటకు హమాస్ అంగీకరించని కారణంగా ఈ దాడులకు ఆదేశించినట్లు ఎక్స్ వేదికగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. ఇజ్రాయెల్ – హమాస్ మధ్య ఇటీవల తొలిదశ కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తమ చెరలో ఉన్న 30 మందికిపైగా బందీలను మిలిటెంట్ సంస్థ విడుదల చేయగా, ప్రతిగా 2వేల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేసింది.
ఈ నేపథ్యంలోనే రెండో దశ కాల్పుల విరమణ ఒప్పందంపై చర్చలు జరగాల్సి ఉంది. అయితే, ఆ చర్చలు జరగలేదు. తొలి దశ ఒప్పందాన్ని ఏప్రిల్ 20 వరకు కొనసాగించాలని అమెరికా ప్రత్యేక రాయబారి ప్రతిపాదించగా, టెల్ అవీవ్ అంగీకరించింది. కానీ హమాస్ నిరాకరించింది. దీంతో హమాస్పై ఒత్తిడి తెచ్చేందుకు ఇజ్రాయెల్ చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ముందుగా గాజాకు వెళ్లే మానవతా సాయాన్ని అడ్డుకోవడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిపివేసింది. తాజాగా వైమానిక దాడి చేసింది.