DK Aruna: బీజేపీ ఎంపీ డీకే అరుణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్

- ఎంపీ ఇంట్లో చొరబడిన గుర్తు తెలియని వ్యక్తి
- కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్న పోలీసులు
- ఆగంతుకుడిని గుర్తించేందుకు సీసీ ఫుటేజీ పరిశీలన
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహబూబ్నగర్ ఎంపీ, బీజేపీ నేత డీకే అరుణకు ఫోన్ చేశారు. డీకే అరుణ నివాసంలోకి గుర్తుతెలియని వ్యక్తి చొరబడిన ఘటనపై మాట్లాడారు. ఎంపీ డీకే అరుణ ఇంట్లోకి ఓ దుండగుడు చొరబడిన విషయం తెలిసిందే. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.
ఇంట్లోకి ప్రవేశించిన ఆగంతుకుడిని గుర్తించేందుకు సీసీ ఫుటేజీని పరిశీలించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఎంపీ ఇంటికి చేరుకొని వివరాలను సేకరించారు. దుండగుడు ప్రవేశించిన ప్రాంతాలను పరిశీలించారు. డీకే అరుణకు కల్పించాల్సిన భద్రత పైనా డీసీపీ వివరాలు సేకరించారు.
ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్డు నెంబర్ 56లోని ఎంపీ నివాసంలో ముసుగు ధరించిన ఆగంతుకుడు ఇంటి వెనుక నుంచి లోనికి ప్రవేశించాడు. సీసీ కెమెరా వైర్లను కత్తిరించి, దాదాపు గంట పాటు ఇంట్లో తిరిగాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
డీకే అరుణ కూతురు ఉదయం నిద్ర లేచేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది. వంట గది కిటికీ గ్రిల్ తొలగించడం గమనించారు. డీకే అరుణ డ్రైవర్ లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు సీసీ కెమెరాల్లో నమోదైన ఆధారాలతో నిందితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.