Nara Lokesh: ఆల్ఫా హోటల్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగిన నారా లోకేశ్

- మంగళగిరిలో పారిశుద్ధ్య కార్మికులను కలిసిన లోకేశ్
- కార్మికులతో ఆప్యాయంగా ముచ్చటించిన వైనం
- వారిని సత్కరించి, కానుకల బహూకరణ
ఏపీ మంత్రి నారా లోకేశ్ ఇవాళ మంగళిగిరిలోని ఆల్ఫా అరేబియన్ రెస్టారెంట్ వద్ద పారిశుద్ధ్య కార్మికులతో కలిసి టీ తాగారు. వారితో ఉల్లాసంగా ముచ్చటించారు. వారిని సత్కరించి, కానుకలు అందజేశారు. ఈ విషయాన్ని లోకేశ్ తన సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా వెల్లడించారు.
"మంగళగిరి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ, తెర వెనుక యోధులు అనదగ్గ పారిశుద్ధ్య కార్మికులను కలవడం గౌరవంగా భావిస్తున్నాను. పని పట్ల వారి అంకితభావం నిజంగా స్ఫూర్తిదాయకం. మన వీధులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి వారు అవిశ్రాంతంగా శ్రమిస్తుండడం పట్ల ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను" అని లోకేశ్ వివరించారు. ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులతో ఫొటోలను పంచుకున్నారు.









