AP Govt: ఏపీ సర్కార్ ఆసక్తికర నిర్ణయం... ఎంపీలు, ఎమ్మెల్యేలకు అవార్డులు!

- ఎంపీలు, ఎమ్మెల్యేలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు వినూత్న కార్యక్రమం
- ప్రజా సమస్యలపై అసెంబ్లీలో, పార్లమెంట్లో పోరాటం చేసే వారికి అవార్డులు
- పార్టీలకు అతీతంగా అవార్డుల ప్రదానం ఉంటుందన్న కూటమి ప్రభుత్వం
ఏపీలోని కూటమి ప్రభుత్వం ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఎంపీలు, ఎమ్మెల్యేలను మరింత చేరువ చేసేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎవరైతే ప్రజా సమస్యలు తెలుసుకుని వారి కోసం అసెంబ్లీలో, పార్లమెంట్లో పోరాటం చేస్తారో వారికి అవార్డులు ఇవ్వాలని నిర్ణయించింది.
పార్టీలకు అతీతంగా ఈ అవార్డుల ప్రదానం ఉంటుందని తెలిపింది. ఏ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు అయినా సరే ప్రజల వద్దకు వెళ్లాలని కోరింది. ఇలా ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రజలకు మరింత దగ్గరవుతారని, ప్రజల సమస్యలను అసెంబ్లీ, పార్లమెంట్కు వినిపిస్తారని భావిస్తోంది.
ఇక ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గళం విప్పితే 'ఉత్తమ లెజిస్లేచర్', అదే పార్లమెంట్లో అయితే 'ఉత్తమ పార్లమెంటేరియన్' తరహాలో అవార్డులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా సభలో సభ్యుల పనితీరు, వారి ప్రవర్తనను పరిగణలోకి తీసుకుని అవార్డు అందజేయనుందని తెలుస్తోంది. కాగా, విజేతల ఎంపిక కోసం ఓ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి, ఆ కమిటీ ఎంపిక చేసిన ఎంపీ, ఎమ్మెల్యేలకు అవార్డులు అందిస్తారని సమాచారం.