Pawan Kalyan: మనం నిలదొక్కుకోవడమే కాదు... నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం: పవన్ కల్యాణ్

- నేడు జనసేన 12వ ఆవిర్భావ సభ
- పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వద్ద జయకేతనం సభ
- పవన్ కల్యాణ్ ఆవేశపూరిత ప్రసంగం
జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ వద్ద నిర్వహించారు. ఈ సభలో జనసేనాని, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉద్వేగభరితంగా ప్రసంగించారు. 2014లో అన్నీ తానై పార్టీ పెట్టానని, అనేక కష్టాలను ఎదుర్కొని ప్రస్థానం కొనసాగించానని వెల్లడించారు. 2019లో ఎన్నికల్లో పోటీ చేశామని... ఓడిపోయినా అడుగు ముందుకే వేశామని అన్నారు.
"మనం నిలబడ్డాం... పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం... మనం నిలదొక్కుకోవడమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీని కూడా నిలబెట్టాం. మనం 2019లో ఓడినప్పుడు మీసాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచులను అవమానించారు, ప్రజలను నిరంతరం హింసించారు. ఇదేం న్యాయం అని మన జనసైనికులు, వీరమహిళలు అడిగితే, గొంతెత్తితే వాళ్లపై కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు.
నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న టీడీపీ నాయకుడ్ని అక్రమ కేసుల్లో జైల్లో బంధించారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను, వారి సీనియర్ నేతలను రోడ్డు మీదికి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాడ్ని అయితే వారు తిట్టని తిట్టు లేదు, చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు.
అసెంబ్లీ గేటు కూడా తాకలేవు అని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడలను బద్దలు కొట్టాం. ఏపీ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో ఇద్దరు ఎంపీలతోటి అడుగుపెట్టాం. దేశం అంతా తలతిప్పి చూసేలా 100 శాతం స్ట్రయిక్ రేట్ తో విజయం సాధించాం... ఇవాళ జయకేతనం ఎగరేస్తున్నాం.... జై జనసేన" అంటూ పవన్ ప్రసంగించారు.