Road Accident: తెలంగాణలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి

- ఆదిలాబాద్ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు
- బస్సు డ్రైవర్ తో పాటు మరో వ్యక్తి మృతి
- నల్లగొండ జిల్లాలో ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు
- హైదరాబాద్ కు చెందిన ఇద్దరు యువకులు మృతి
తెలంగాణ రాష్ట్రంలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. ఆదిలాబాద్ జిల్లా జందాపూర్ ఎక్స్ప్రెస్ రోడ్డు సమీపంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని ఒక ప్రైవేటు బస్సు ఢీకొనడంతో ఈ దుర్ఘటన సంభవించింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్తో పాటు మరొక వ్యక్తి మృతి చెందగా, పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి నాగ్పూర్ వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది.
మరో ఘటనలో, నల్లగొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని కారు వెనుక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కామినేని ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పొగమంచు కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతులు హైదరాబాద్లోని అల్వాల్ ప్రాంతానికి చెందిన కుంచేల సాయి గౌడ్ (34), ప్రవీణ్ (32)గా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.