Gudivada Amarnath: ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత కూటమి నేతలు మాట మార్చారు: గుడివాడ అమర్ నాథ్

- ఎవరు గెలిస్తే వారు తమ అభ్యర్థి అని చెప్పుకుంటున్నారని అమర్ నాథ్ విమర్శ
- ఓటమిని హుందాగా ఒప్పుకోవాలని హితవు
- ఉద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని వ్యాఖ్య
ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి నేతలు మాట మార్చారని వైసీపీ నేత, మాజీ మంత్రి గుడివాడ అమర్ నాథ్ విమర్శించారు. ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని అన్నారు. ఎవరు గెలిస్తే వారే తమ అభ్యర్థి అని చెప్పుకోవడానికి సిగ్గు లేదా? అని ప్రశ్నించారు. ఓటమిని హుందాగా ఒప్పుకోవాలని సూచించారు. విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
రఘువర్మ ఓటమి తర్వాత తమకు సంబంధం లేదని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పడం ఆశ్చర్యం కలిగించిందని అమర్ నాథ్ అన్నారు. ప్రభుత్వ పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పారు. ఉద్యోగులు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారని, ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదని దుయ్యబట్టారు. శ్రీనివాసులు నాయుడు కూడా కూటమి తనకు మద్దతు ప్రకటించలేదని చెప్పారని అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు వైసీపీ దూరంగా ఉందని చెప్పారు. కూటమి పాలనలో రుషికొండ బీచ్ కు అన్యాయం జరిగిందని విమర్శించారు. ప్రభుత్వ చేతకాని చర్యల వల్ల ఉత్తరాంధ్ర జిల్లాలకు తీరని అన్యాయం జరుగుతోందని అన్నారు.