Nara Lokesh: పాఠశాలల్లో కనీస మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం దృష్టి: మంత్రి లోకేశ్‌

Nara Lokesh Speech in AP Assembly

  • దశలవారీగా స్కూళ్లలో ప్రహరీగోడల నిర్మాణం చేపడతామ‌న్న మంత్రి
  • నాడు-నేడు అక్రమాలపై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామ‌ని వెల్ల‌డి
  • గత ప్రభుత్వం జీఓ 117తో నిరుపేద పిల్లలకు విద్యను దూరం చేసింద‌ని విమ‌ర్శ‌

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి ప్రహరీగోడల నిర్మాణానికి రూ. 3వేల కోట్లు అవసరం అవుతాయ‌ని  రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ఉపాధి హామీ, మన బడి మన భవిష్యత్తు నిధుల కన్వర్జెన్స్ తో దశలవారీగా ప్రహరీగోడల నిర్మాణం చేపడతామన్నారు. 

రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రహరీగోడల నిర్మాణం, నాడు-నేడు అక్రమాలు, అసంపూర్తిగా నిలచిపోయిన భవనాలు, కనీస మౌలిక సదుపాయాలు, డ్రగ్స్ నివారణపై శాసనసభ్యులు అదితి గజపతిరాజు (విజయనగరం), మిరియాల శిరీషకుమారి (రంపచోడవరం), బండారు శ్రావణి శ్రీ (శింగనమల), పల్లె సింధూర రెడ్డి (పుట్టపర్తి) అడిగిన ప్రశ్నకు శాసనసభలో మంత్రి లోకేశ్‌ సమాధానమిచ్చారు.  

ఇటీవల మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో పాఠశాలల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్, అవుట్ కమ్స్ పై స్టార్ రేటింగ్ ఇచ్చామ‌ని గుర్తు చేశారు. కనీస మౌలిక సదుపాయాలు లేని 1, 2 స్టార్ రేటింగ్ పాఠశాలలల్లో లీక్ ప్రూఫ్ భవనాలు, బెంచీలు, టాయ్ లెట్లు, తాగునీరు వంటి కనీస మౌలిక సదుపాయాలపై దృష్టిపెట్టామ‌న్నారు. ఇందులో భాగంగానే ఈరోజు శాసనసభ్యులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామ‌ని తెలిపారు. 

గత ప్రభుత్వం 117 జీఓతో నిరుపేద పిల్లలకు విద్యను దూరం చేసింద‌ని దుయ్య‌బ‌ట్టారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రభుత్వ స్కూళ్లలో 12 లక్షల మంది విద్యార్థులు తగ్గిపోయార‌ని మంత్రి మండిప‌డ్డారు. 117 జీఓకు ప్రత్యామ్నాయంపై ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయ సంఘాలతో చర్చిస్తున్నట్లు తెలిపారు. నాడు-నేడులో అసంపూర్తిగా మిగిలిపోయిన పనులకు సంబంధించి వివరాలు సేకరించి, వాటిని పూర్తిచేస్తామ‌న్నారు. 

జీఓ 117 ప్రత్యామ్నయంపై చర్చించిన తర్వాత టీచర్ ట్రాన్స్ ఫర్స్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తామ‌ని చెప్పారు. గత ప్రభుత్వం చేపట్టిన నాడు-నేడు పనులపై అనేక ఆరోపణలు వచ్చాయ‌ని, 117 జీఓ కారణంగా పనులు ప్రారంభించిన కొన్ని పాఠశాలలు మూతపడ్డాయ‌ని గుర్తు చేశారు. నాడు-నేడు అవకతవకలపై నివేదిక తెప్పించుకుని, సభ్యులతో చర్చించిన తర్వాత చర్యలు తీసుకుంటామ‌న్నారు. 

రంపచోడవరం నియోజకవర్గంలో 80 పాఠశాలల్లో ఇన్ ఫ్రాస్ట్రక్చర్ అవసరం ఉంద‌న్నారు. ఇక్కడ ప్రత్యేక పథకం ద్వారా మౌలిక సదుపాయాలు పూర్తిచేస్తామ‌ని మంత్రి లోకేశ్ తెలిపారు. కేజీబీవీలకి సంబంధించి వంద‌ శాతం ప్రహరీగోడలను ఈ సంవత్సరం డిసెంబర్ లోగా పూర్తి చేస్తామ‌న్నారు. రాబోయే 3నెలల్లో సీసీ టీవీ, లైటింగ్ ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వంతో పాటు సభ్యులంతా భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. 

పాఠశాలలకు స్టార్ రేటింగ్‌తో పాటు లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (లీప్) ప్రోగ్రామ్ లో సంస్కరణలు తెస్తున్నామ‌న్నారు. సభ్యులు వారి నియోజకవర్గాల్లో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద నిధులు సమీకరించుకొని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి కృషిచేసి, స్టార్ రేటింగ్ మెరుగుప‌ర‌చాల‌ని తెలిపారు. అందరూ కలసికట్టుగా ప్రహరీగోడలు, బేసిక్ ఇన్ ఫ్రాకు చొరవ చూపాలని మంత్రి అన్నారు. 

రాబోయే ఐదేళ్లలో ప్రభుత్వ స్కూళ్లలో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి లోకేశ్‌ చెప్పారు. డ్రగ్స్ నివారణకు చేపడుతున్న చర్యలపై మంత్రి సమాధానమిస్తూ... డ్రగ్స్ వద్దు బ్రో అనే క్యాంపెయిన్ చేపడుతున్నట్లు పేర్కొన్నారు. గంజాయి కారణంగా ఒక తరం ఎలా నాశనమవుతుందో తెలియజెప్పి, విద్యార్థుల్లో చైతన్యం కలిగించేందుకు ప్రతి పాఠశాలలో ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేస్తున్నామ‌న్నారు. వీటిని రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కాలేజీల్లో ఏర్పాటు చేస్తామ‌ని తెలిపారు. పదోతరగతి, ఇంటర్ పరీక్షల తర్వాత ఈ క్లబ్బులను యాక్టివేట్ చేస్తామని మంత్రి లోకేశ్ వివరించారు.

  • Loading...

More Telugu News