AP Agriculture Budget: ఏపీ వ్యవసాయ బడ్జెట్... హైలైట్స్

- రూ. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన అచ్చెన్నాయుడు
- స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నామన్న మంత్రి
- ఉచిత వ్యవసాయ విద్యుత్ కు రూ. 12,773 కోట్లు
ఏపీ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా అచ్చెన్నాయుడు మాట్లాడుతూ... స్వర్ణాంధ్ర లక్ష్యంగా ముందుకు అడుగులు వేస్తున్నామని చెప్పారు. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారించామని తెలిపారు. వరిని ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారని అన్నారు.
11 పంటలను గ్రోత్ ఇంజిన్లుగా పరిగణిస్తున్నామని, ఆ పంటలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. వ్యవసాయంలో వృద్ధిరేటు 22.86 శాతంగా నమోదయిందని తెలిపారు. రాయితీపై విత్తన పంపిణీ పథకానికి ప్రత్యేక కేటాయింపులు చేస్తున్నామని చెప్పారు. రూ. 48,340 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ. 120 కోట్ల విత్తన రాయితీలను తమ ప్రభుత్వంలో చెల్లించామని చెప్పారు. 35.8 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువు సరఫరా చేశామని తెలిపారు.
ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని అచ్చెన్న చెప్పారు. ఎరువుల నిర్వహణకు రూ. 40 కోట్లు కేటాయించామని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ప్రోత్సాహానికి రూ. 61 కోట్లు... వ్యవసాయ యంత్రాల రాయితీకి రూ. 139 కోట్లు కేటాయించామని చెప్పారు.
డ్రోన్ల రాయితీకి రూ. 80 కోట్లు కేటాయించామని అచ్చెన్నాయుడు తెలిపారు. 875 కిసాన్ డ్రోన్ వ్యవసాయ యాంత్రీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. విత్తన రాయితీకి రూ. 240 కోట్లు... వ్యవసాయ యాంత్రీకరణకు రూ. 219 కోట్లు... అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ అమలుకు రూ. 9,400 కోట్లు, ఉచిత పంటల బీమా కోసం రూ. 1,023 కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.
ఉద్యానవన శాఖకు రూ. 930 కోట్లు, సహకార శాఖకు రూ. 239 కోట్లు, ధరల స్థిరీకరణ నిధికి రూ. 300 కోట్లు, పట్టు పరిశ్రమ అభివృద్ధికి రూ. 92 కోట్లు, 2 లక్షల టన్నుల ఎరువుల బఫర్ స్టాక్ నిర్వహణకు రూ. 40 కోట్లు, పశు సంవర్ధక శాఖకు రూ. 1,112 కోట్లు, ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకానికి రూ. 12,773 కోట్లు, మత్స్యరంగం అభివృద్ధికి రూ. 540 కోట్లు, ఎన్టీఆర్ జలసిరి కోసం రూ. 50 కోట్లను కేటాయించినట్టు తెలిపారు.