Donald Trump: ట్రంప్, మస్క్కు భారీ షాకిచ్చిన డోజ్ ఉద్యోగులు

- 21 మంది ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా
- ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగం కాలేమన్న ఉద్యోగులు
- ఉద్యోగంలో చేరినప్పుడు చేసిన ప్రమాణాన్ని ఉల్లంఘించలేమని స్పష్టీకరణ
సాంకేతిక, నిర్మాణాత్మక సవరణల ద్వారా ఫెడరల్ ప్రభుత్వ పరిమాణాన్ని తగ్గించాలన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ చేసిన ప్రయత్నాలకు ఎదురుదెబ్బ తగిలింది. మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (డోజ్) ఉద్యోగులు 21 మంది నిన్న మూకుమ్మడిగా రాజీనామా చేశారు.
ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో తాము భాగం కాలేమంటూ వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా చేసిన వారిలో ఇంజినీర్లు, డేటా సైంటిస్టులు, ప్రొడక్ట్ మేనేజర్లు ఉన్నారు. సివిల్ సర్వీస్ ఉద్యోగుల తొలగింపునకు తమ నైపుణ్యాలను వినియోగించలేమని ఈ సందర్భంగా వారు స్పష్టం చేశారు. అమెరికన్ ప్రజలకు సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేశామని, అధ్యక్ష పాలనా వ్యవస్థలో రాజ్యాంగ విలువలు నిలబెడతామని ప్రమాణం చేశామని, ఇప్పుడు దానిని ఉల్లంఘంచి ఉద్యోగాల్లో కొనసాగలేమని సంయుక్త రాజీనామా లేఖలో వారు పేర్కొన్నారు.
కాగా, ఫెడరల్ ప్రభుత్వ సైజును తగ్గించేందుకు బిలియనీర్ మస్క్ ఆధ్వర్యంలో ఏర్పాటైన డోజ్లో రాజకీయ ఉద్దేశాలు ఉన్నవారే అధికంగా ఉన్నారని, లక్ష్య సాధనలో వారికి ఎలాంటి నైపుణ్యం కానీ, అనుభవం కానీ లేవని వారు ఆరోపించారు.
ఉద్యోగుల మూకుమ్మడి రాజీనామా అధ్యక్షుడు ట్రంప్, మస్క్కు ఎదురుదెబ్బగానే చెబుతున్నారు. కాగా, ట్రంప్ అధికారం చేపట్టగానే మస్క్ నేతృత్వంలో డోజ్ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఇది రద్దు చేసిన కాంట్రాక్టుల్లో 40 శాతం నిరుపయోగమైనవేనని తేలింది. గత వారం నాటికి డోజ్ ఏకంగా 1,125 కాంట్రాక్ట్లను రద్దు చేసింది. వాటిలో 417 కాంట్రాక్టుల రద్దు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని తేలింది.