YS Sharmila: మీరు 11 మంది వచ్చింది 11 నిమిషాల కోసమా?: జగన్పై షర్మిల ఫైర్!

- జనాలు ఛీ కొడుతున్నా జగన్ తీరు మారడం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు
- ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా? అని నిలదీసిన షర్మిల
- సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో హాజరు కోసం వచ్చారా? అని మండిపాటు
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. ఏపీ అసెంబ్లీలో జగన్, వైసీపీ సభ్యుల తీరును తప్పుబడుతూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఆమె నిలదీశారు. జనాలు ఛీ కొడుతున్నా జగన్ తీరు మాత్రం మారడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
మీరు 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చింది 11 నిమిషాలు ఉండటానికా? అని ప్రశ్నించారు. ప్రజా సమస్యల కన్నా మీకు ప్రతిపక్ష హోదానే ముఖ్యమా అని నిలదీశారు. సభ్యత్వాలు రద్దవుతాయనే భయంతో హాజరు కోసం వచ్చారా? కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికి మీకు ప్రతిపక్ష హోదానే కావాలా ? అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.
అలాగే గవర్నర్ ప్రసంగంపై కూడా షర్మిల విమర్శలు గుప్పించారు. ఆయన ప్రసంగంలో పసలేదని పేర్కొన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలు కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం తీవ్ర నిరాశను మిగిల్చిందని ఆమె దుయ్యబట్టారు.