USA: మోదీ-ట్రంప్ సమావేశమైన కొన్ని రోజులకే భారత్కు భారీ షాక్ ఇచ్చిన అమెరికా

- భారత్కు అందిస్తున్న 21 మిలియన్ డాలర్ల సాయం నిలిపివేత
- బంగ్లాదేశ్కు అందిస్తున్న 29 మిలియన్ డాలర్ల సాయం కూడా కట్
- మరికొన్ని దేశాలకు కూడా సాయం నిలిపివేత
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్, బంగ్లాదేశ్ సహా పలు దేశాలకు భారీ షాక్ ఇచ్చారు. భారత్లో ఓటరు శాతాన్ని పెంచేందుకు ఇప్పటి వరకు అందిస్తున్న 21 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.182 కోట్లు) సాయాన్ని నిలిపివేశారు. ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్ సారథ్యంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్స్ (డీవోజీఈ) తాజాగా ప్రకటించింది. అలాగే, బంగ్లాదేశ్ను రాజకీయంగా బలోపేతం చేసే లక్ష్యంతో కేటాయిస్తున్న 29 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 251 కోట్లు) సాయాన్ని కూడా నిలిపివేసింది.
అంతర్జాతీయ సాయంలో విస్తృతంగా విధిస్తున్న కోతల్లో భాగంగానే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. భారత్, బంగ్లాదేశ్లో ఎన్నికల ప్రక్రియ, రాజకీయ స్థిరత్వాన్ని మెరుగుపరిచే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఈ గ్రాంట్ను అందిస్తోంది. డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమావేశమైన కొన్ని రోజులకే అమెరికా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బడ్జెట్లో కోతలు లేకపోతే అమెరికా దివాలా తీస్తుందని మస్క్ ఇటీవల పలుమార్లు నొక్కి చెప్పారు. ఇప్పుడు బడ్జెట్లో కోత విధించడం ద్వారా భారత్, బంగ్లాదేశ్కు అందిస్తున్న సాయాన్ని నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. అమెరికా తాజా నిర్ణయంతో మరికొన్ని దేశాలకు కూడా సాయం నిలిచిపోనుంది.