Crime News: తెనాలిలో యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలు

- జీతం డబ్బులు ఇస్తానంటే విజయవాడ వచ్చిన బాధితుడు
- అక్కడ మరో నలుగురితో కలిసి కిడ్నాప్ చేసి తెనాలి తీసుకెళ్లిన నిందితుడు
- అక్కడ ఓ ఇంట్లో బంధించి చిత్రహింసలు
బాకీ పడిన వేతనం డబ్బులు ఇస్తామని పిలిపించి యువకుడిని కిడ్నాప్ చేసి చిత్రహింసలకు గురిచేసిన ఉదంతం గుంటూరు జిల్లా తెనాలిలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం ప్రకారం.. హైదరాబాద్లో వ్యాపారం చేస్తున్న తెనాలికి చెందిన మణిదీప్ వద్ద కాకినాడ జిల్లా పెద్దాపురానికి చెందిన యువకుడు సతీశ్ గతంలో పనిచేసి మానేశాడు. ఆ సమయంలో అతడికి రెండు నెలల జీతం రావాల్సి ఉంది. దీంతో వాటి కోసం సతీశ్ తరచూ మణిదీప్కు ఫోన్ చేస్తూ ఉండేవాడు.
ఈ క్రమంలో తాజాగా మరోమారు ఫోన్ చేయడంతో విజయవాడ వచ్చి తీసుకెళ్లాలని మణిదీప్ చెప్పాడు. నిజమేనని నమ్మి శుక్రవారం సాయంత్రం విజయవాడ వచ్చిన సతీశ్ను మణిదీప్ సహా మరో నలుగురు బలవంతంగా కారులో ఎక్కించుకుని తెనాలి తీసుకెళ్లారు. మార్గమధ్యంలో అతడిపై అందరూ కలిసి దాడిచేశారు. ఇంట్లో బంధించి కరెంట్ షాక్ ఇచ్చారు.
సతీశ్ను అర్ధరాత్రి కారులో ఎక్కించుకుని తీసుకెళ్తుండగా తెనాలి-గుంటూరు వంతెనపై ఎదురుగా పోలీస్ వాహనం వస్తుండటంతో బాధితుడు కేకలు వేశాడు. దీంతో నిందితులు కారు ఆపడంతో సతీశ్ వెంటనే బయటకు దూకి పోలీసులకు విషయం చెప్పాడు. దీంతో నిందితుల్లో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది.