K Kavitha: ముగ్గురు మంత్రులు ఉండి కూడా వేస్ట్... రాజీనామా చేయాలి: కవిత

- ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలన్న కవిత
- అభివృద్ధిలో వీరు చేసిందేమీ లేదని విమర్శ
- టీడీపీ, బీజేపీ పొత్తు వల్ల ఏపీకి అన్ని అనుమతులు వస్తున్నాయని వ్యాఖ్య
ఖమ్మంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... సేవాలాల్ జయంతి వేడుకలు అధికారికంగా జరుగుతుండటం కేసీఆర్ చలవేనని చెప్పారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇచ్చిన ఘనత కేసీఆర్ దేనని అన్నారు. కేసీఆర్ రాకముందు పేద ఇంటి ఆడపిల్లకు పెళ్లి చేయాలంటే ఎంతో ఇబ్బంది పడేవారని... కేసీఆర్ వచ్చిన తర్వాత కళ్యాణలక్ష్మి పథకంతో పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లను సులభతరం చేశారని చెప్పారు.
ఖమ్మంలో పేరుకే ముగ్గురు మంత్రులు ఉన్నారని... అభివృద్ధిలో మాత్రం వీరు చేసిందేమీ లేదని కవిత విమర్శించారు. అభివృద్ధి చేయలేని ఈ ముగ్గురు మంత్రులు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని అన్నారు. ప్రజల అంచనాలకు మించి కేసీఆర్ ప్రభుత్వం పని చేసిందని చెప్పారు.
టీడీపీ, బీజేపీ పొత్తులో ఉండటం వల్ల ఏపీకి అన్ని అనుమతులు వస్తున్నాయని కవిత అన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ కు అనుమతి వస్తే తెలంగాణకు చాలా నష్టమని చెప్పారు. కేంద్రం అనుమతి లేకుండానే ఏపీలో ప్రాజెక్టులు కడుతున్నారని అన్నారు. కళ్ల ముందే నీళ్లు వెళ్లిపోతున్నా... సీఎం సొంత జిల్లాలో ఒక్క తట్ట మట్టి కూడా ఎత్తిపోయలేదని విమర్శించారు. పోలవం ఏడు మండలాల కోసం తాము ఎంతో పోరాటం చేశామని చెప్పారు.