Subrahmanyam Jaishankar: ఇదిగో సిరా చుక్క!: ప్రజాస్వామ్యంపై జైశంకర్ కీలక వ్యాఖ్యలు

- ప్రజాస్వామ్య భారత్లో అద్భుతంగా జీవిస్తున్నామన్న జైశంకర్
- ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందన్న వ్యాఖ్యలతో ఏకీభవించనన్న కేంద్రమంత్రి
- కొన్ని ప్రాంతాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయని అంగీకరిస్తానన్న కేంద్రమంత్రి
భారత్ ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ తాము అద్భుతంగా జీవిస్తున్నామని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ అన్నారు. ఓటింగ్లో పాల్గొని ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నామని చెప్పారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఓటు హక్కును వినియోగించుకున్నానంటూ తన వేలికి ఉన్న సిరా చుక్కను చూపించారు.
జర్మనీలోని మ్యూనిచ్ నగరంలో 61వ మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరుగుతోంది. ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యం కష్టాల్లో కూరుకుపోయిందా? అని అడిగిన ప్రశ్నపై ఆయన మాట్లాడారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనే వాదనతో తాను ఏకీభవించనని ఆయన అన్నారు. భారత ఎన్నికల ప్రక్రియపై తనకు విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. భారత్లో ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత ఎలాంటి వివాదాలు ఉండవని చెప్పారు.
ప్రజాస్వామ్యం మన అవసరాలు తీర్చదని ఒక సెనేటర్ వ్యాఖ్యానించారు. దీనికి జైశంకర్ బదులిస్తూ, ప్రజాస్వామ్య భారత్ దాదాపు 800 మిలియన్ల మందికి పోషకాహార సహాయాన్ని అందిస్తోందని వెల్లడించారు.
కొన్ని ప్రాంతాల్లో ప్రజాస్వామ్యం సమర్థవంతంగా పనిచేస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో సవాళ్లు ఎదురవుతున్నాయనే విషయాన్ని మాత్రం అంగీకరిస్తున్నట్లు చెప్పారు. అన్ని ప్రాంతాల్లో దీనిని ఒకేవిధంగా పరిగణనలోకి తీసుకోవద్దన్నారు. భారత్ బలమైన ప్రజాస్వామ్య దేశమని ఆయన అన్నారు. దేశంలో రాజకీయ నిరాశావాదం ప్రబలంగా ఉందన్న వాదనలను ఆయన ఖండించారు.