G. Kishan Reddy: నరేంద్ర మోదీ కులంపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు... స్పందించిన కిషన్ రెడ్డి

- 1994లోనే మోదీ కులాన్ని బీసీలో చేర్చారన్న కిషన్ రెడ్డి
- అప్పుడు కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని వెల్లడి
- రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శ
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి అలా మాట్లాడటం సరికాదని అన్నారు. బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 1994లోనే నరేంద్ర మోదీ కులాన్ని బీసీల్లో చేర్చారని చెప్పారు. అప్పుడు గుజరాత్లో కాంగ్రెస్ పార్టీయే అధికారంలో ఉందని గుర్తు చేశారు.
కాంగ్రెస్ పార్టీ మండల్ కమిషన్ సిఫార్సులను తొక్కిపెట్టిందని ఆయన అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాకే మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేసిందని ఆయన అన్నారు. అరవై ఏళ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా కుల గణన ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. కుల గణనలలో అవకతవకలు జరిగాయని బీసీ సంఘాలే ఆరోపణలు చేస్తున్నాయని అన్నారు.
తెలంగాణలో ఇప్పుడు బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ పైనే ఎక్కువ వ్యతిరేకత ఉందని కిషన్ రెడ్డి అన్నారు. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ పేరుతో ఇచ్చిన హామీని అమలు చేయలేదని విమర్శించారు. ఆరు గ్యారెంటీలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని ఆయన అన్నారు. ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసే స్థోమత కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు. పలు యూనివర్సిటీలను అప్ గ్రేడ్ చేస్తామని చెప్పి విస్మరించారని మండిపడ్డారు.