Kumbh Mela: మహా కుంభమేళాకు 50 కోట్లు దాటిన భక్తులు... ఆ ఒక్కరోజే 8 కోట్ల భక్తుల పుణ్యస్నానాలు

Over 50 crore people taken dip in Maha Kumbh

  • ఈరోజు సాయంత్రానికి 50 కోట్లు దాటినట్లు తెలిపిన ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం
  • జనవరి 29న మౌని అమావాస్య రోజు అత్యధికంగా భక్తులు వచ్చినట్లు వెల్లడి
  • అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాక్, బంగ్లాదేశ్ జనాభా కంటే కుంభమేళా భక్తులు ఎక్కువ అన్న ప్రభుత్వం

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళాకు ఇప్పటి వరకు వచ్చిన భక్తుల సంఖ్య 50 కోట్లు దాటిందని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది. భారత్, చైనా మినహా మిగిలిన ప్రపంచ దేశాల జనాభాను దాటేసినట్లు తెలిపింది. కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించిన వారి సంఖ్య అమెరికా, రష్యా, ఇండోనేషియా, బ్రెజిల్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ దేశాల జనాభా కంటే ఎక్కువ అని తెలిపింది.

శుక్రవారం సాయంత్రానికి ప్రయాగ్‌రాజ్ వచ్చిన భక్తుల సంఖ్య 50 కోట్లు దాటిందని ప్రభుత్వం తెలిపింది. మానవ చరిత్రలో ఏ మతపరమైన, సాంస్కృతిక లేదా సామాజిక కార్యక్రమంలో కూడా ఈ స్థాయిలో జనం పాల్గొనలేదని తెలిపింది. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు 92 లక్షల మంది భక్తులు తరలి వచ్చినట్లు తెలిపింది. జనవరి 29న మౌని అమావాస్య రోజు దాదాపు 8 కోట్ల మంది భక్తులు వచ్చినట్లు ప్రభుత్వం తెలిపింది.

144 ఏళ్లకు ఓసారి వచ్చే మహా కుంభమేళా జనవరి 13న ప్రారంభమై ఫిబ్రవరి 26న ముగియనుంది. కుంభమేళాకు 45 కోట్ల మంది వరకు భక్తులు వస్తారని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. కానీ మరో పన్నెండు రోజులు ఉండగానే భక్తుల సంఖ్య 50 కోట్లను దాటింది. ఇదిలా ఉండగా, కుంభమేళా విషయమై అసత్య ప్రచారం చేస్తున్న వారిపై ఉత్తర ప్రదేశ్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అసత్య సమాచారం, తప్పుదోవ పట్టించే వీడియోలు వ్యాప్తి చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటున్నారు.

Kumbh Mela
Uttar Pradesh
BJP
  • Loading...

More Telugu News