Shashi Tharoor: ప్రధాని నరేంద్రమోదీపై కాంగ్రెస్ నేత శశిథరూర్ ప్రశంసలు

- ట్రంప్తో జరిగిన సమావేశంలో ప్రధాని మోదీ హుందాగా నడుచుకున్నారన్న శశిథరూర్
- దేశం ఎదురు చూస్తున్న పలు సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని వ్యాఖ్య
- అమెరికా విధించే టారిఫ్పై తొందరపడకూడదన్న శశిథరూర్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్ ప్రశంసలు కురిపించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మోదీ జరిపిన చర్చలు భారత్కు ఆశాజనకంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడితో జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో మన ప్రధాని హుందాగా నడుచుకున్నారని ప్రశంసించారు. దేశం ఎదురు చూస్తున్న పలు సమస్యలు త్వరలో పరిష్కారమవుతాయని శశిథరూర్ ఆశాభావం వ్యక్తం చేశారు.
మన దేశంపై అమెరికా టారిఫ్లు విధిస్తుండటంపై కూడా శశిథరూర్ స్పందించారు. అమెరికా అధిక టారిఫ్ విధిస్తోందని, మనం తొందరపాటు చర్యలు తీసుకుంటే ఆ ప్రభావం దేశం నుండి ఎగుమతి అయ్యే ఇతర ఉత్పత్తులపై పడే అవకాశం ఉందని అన్నారు.
అక్రమ వలసల అంశంపై ప్రధాని మోదీ అమెరికాలో కీలక వ్యాఖ్యలు చేశారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో నివసిస్తున్న భారతీయులను స్వదేశానికి తీసుకువస్తామని స్పష్టం చేశారు. చట్టవిరుద్ధంగా ఒక దేశంలోకి ప్రవేశిస్తే, అక్కడ నివసించే హక్కు ఉండదని, ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఒకే సూత్రం వర్తిస్తుందన్నారు. అలా వెళ్లిన భారతీయులు తిరిగి రావాలని ప్రధాని మోదీ విజ్ఞప్తి చేశారు.