Central Government: నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్రం

- దశాబ్దాల నాటి చట్టం స్థానంలో కొత్త చట్టాన్ని తీసుకు వస్తున్న కేంద్రం
- విపక్షాల నిరసనల మధ్య బిల్లును ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
- సభ నుండి వాకౌట్ చేసిన విపక్షాలు
కేంద్ర ప్రభుత్వం నూతన ఆదాయపు పన్ను బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ విపక్షాలు లోక్సభ నుండి వాకౌట్ చేశాయి. ప్రస్తుతం అమలులో ఉన్న దశాబ్దాల నాటి ఆదాయపు పన్ను చట్టం స్థానంలో కేంద్రం కొత్త చట్టాన్ని తీసుకురానుంది. ఇందులో భాగంగా ఆదాయపు పన్ను నూతన బిల్లు-2025ను పార్లమెంటు ముందుకు తీసుకువచ్చింది.
విపక్షాల నిరసనల మధ్య నిర్మలా సీతారామన్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. దీంతో విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి. ఆ తర్వాత కాసేపటికి లోక్సభ మార్చి 10కి వాయిదా పడింది.
1961లో రూపొందించిన ఆదాయపు పన్ను చట్టానికి, ఇప్పటివరకు ఎన్నో సవరణలు జరిగాయి. దీంతో ఇది సంక్లిష్టంగా మారింది. పన్ను చెల్లింపుదారులకు వ్యయాలు పెరిగాయి. దీంతో ఈ చట్టాన్ని సమీక్షించి, సరళతరం చేస్తామని 2024 జులై బడ్జెట్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఇప్పుడు బిల్లును రూపొందించారు.