PM Modi: అమెరికాలో ప్రధాని మోదీకి ప్రవాస భారతీయుల ఘన స్వాగతం

- రెండు రోజుల పర్యటన కోసం అమెరికా వెళ్లిన ప్రధాని మోదీ
- వాషింగ్టన్ డీసీ చేరుకున్న ప్రధానికి యూఎస్ అధికారులు, ఎన్నారైల గ్రాండ్ వెల్కమ్
- తనకు ఘన స్వాగతం పలికిన ప్రవాస భారతీయులకు మోదీ కృతజ్ఞతలు
ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన కోసం అమెరికా చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు యూఎస్ మిలిటరీతో పాటు ప్రభుత్వ అధికారులు ఘన స్వాగతం పలికారు. వాషింగ్టన్ డీసీ చేరుకున్న ప్రధాని కోసం ప్రవాస భారతీయులు గడ్డకట్టే చలిలో కూడా వెల్కమ్ టు అమెరికా అంటూ ప్ల కార్డులు చేతబట్టి ఘనంగా ఆహ్వానించారు. బ్లెయిర్ హౌస్ చేరుకున్న మోదీ.. భారతీయులను కలిసి, వారితో కరచాలనం చేస్తూ ఉత్సాహపరిచారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ప్రత్యేకంగా పోస్టు పెట్టారు. "కొద్దిసేపటి క్రితం వాషింగ్టన్ డీసీలో అడుగుపెట్టాను. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో మీటింగ్ కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను. ఇండియా-యూఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించడం మా లక్ష్యం. ఇరు దేశాల ప్రజల ప్రయోజనం కోసం, మెరుగైన భవిష్యత్తు కోసం అమెరికా, భారత్ ఎప్పుడూ కలిసి పనిచేస్తూనే ఉంటాయి" అని మోదీ ట్వీట్ చేశారు.
ఇక ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా మోదీ... అమెరికా అధ్యక్షుడితో పాటు కాంగ్రెస్ చట్టసభ సభ్యులు, పలువురు ప్రముఖులతో సమావేశం అవుతారని సమాచారం. కాగా, ఈ పర్యటనకు ముందు ప్రధాని ఫ్రాన్స్ లో రెండు రోజుల పాటు పర్యటించిన విషయం తెలిసిందే.