Rangarajan Attack Case: రంగరాజన్ పై దాడి కేసు... విచారణలో నేరాన్ని అంగీకరించిన వీరరాఘవరెడ్డి!

Veera Raghavareddy confessed to the crime in the trial of Rangarajan attack case

  • చిలుకూరు ఆలయ అర్చకుడు రంగరాజన్ పై ఇటీవల దాడి
  • 22 మందిపై కేసు
  • ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురు నిందితులు అరెస్ట్
  • పరారీలో 16 మంది నిందితులు
  • వెలుగులోకి రిమాండ్ రిపోర్టులోని కీలక అంశాలు!

చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై దాడి కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి సహా ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరో 16 మంది నిందితులు పరారీలో ఉన్నారు. రామరాజ్యం సంస్థ వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డిపై అబిడ్స్, గోల్కొండ, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. 

రంగరాజన్ పై దాడి కేసులో పోలీసులు మొత్తం 22 మందిని నిందితులుగా చేర్చారు. నిందితుల రిమాండ్ రిపోర్ట్ కు సంబంధించి కొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. వీరరాఘవరెడ్డి విచారణలో నేరాన్ని అంగీకరించాడు. 

గత జనవరిలో వీరరాఘవరెడ్డి అర్చకుడు రంగరాజన్ ను కలిశాడు. వీరరాఘవరెడ్డి ప్రతిపాదనకు రంగరాజన్ స్పందించలేదు. ఈ నేపథ్యంలో, నిందితులంతా జనవరి 25న పెనుగొండ ఆలయంలో కలుసుకున్నారు. ఫిబ్రవరి 4న మరోసారి దమ్మాయిగూడలో సమావేశమయ్యారు. తమ మాట వినకపోతే రంగరాజన్ పై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు. 

ఈ నెల 7న వారు రంగరాజన్ ఇంటికి వెళ్లారు. తాము చెప్పినట్టు చేయకుంటే పర్యవసానాలు దారుణంగా ఉంటాయని హెచ్చరించారు. ఇక, రంగరాజన్ పై దాడిని వీడియో చిత్రీకరించిన నిందితులు... ఆ వీడియోలను ఆన్ లైన్ లో అప్ లోడ్ చేశారు.

  • Loading...

More Telugu News