Attack On Rangarajan: రంగరాజన్ పై దాడి హేయం... దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: ఏపీ సీఎం చంద్రబాబు

- చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్ పై దాడి
- దాడికి పాల్పడిన రామరాజ్యం సంస్థ సభ్యులు
- హింసను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించరాదన్న చంద్రబాబు
హైదరాబాదులోని చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు సీఎస్ రంగరాజన్ పై రామరాజ్యం సంస్థ సభ్యులు దాడి చేయడం తెలిసిందే. చిలుకూరు ఆలయానికి వచ్చే భక్తులను తమ సంస్థలో చేర్చాలని రామరాజ్యం వ్యవస్థాపకుడు వీరరాఘవరెడ్డి కోరగా, రంగరాజన్ అందుకు నిరాకరించారు. దాంతో రామరాజ్యం సభ్యులు ఆయనపై దాడికి పాల్పడ్డారు. రంగరాజన్ పై దాడిని ప్రతి ఒక్కరూ ఖండిస్తున్నారు.
తాజాగా దీనిపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. చిలుకూరు ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్ పై దాడి హేయమని, దీన్ని తాను ఖండిస్తున్నానని తెలిపారు.
మనం నాగరిక సమాజంలో ఉన్నాం, భేదాభిప్రాయాలు ఉన్నప్పుడు మర్యాదగా మాట్లాడుకోవడం సబబు... ఎప్పటికీ ఇదే సరైన మార్గం అని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ హింసకు తావులేదని, హింస ఏ రూపంలో ఉన్నా అది ఆమోదయోగ్యం కాదని చంద్రబాబు స్పష్టం చేశారు.