AMR India chairman: కొండగట్టు అంజన్నకు బంగారు కిరీటాన్ని బహూకరించిన ఏఎంఆర్ చైర్మన్

- కొండగట్టు అంజన్నను దర్శించుకున్న ఏఎంఆర్ చైర్మన్ మహేశ్వరరెడ్డి
- కోటి పది లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలు వితరణగా అందజేత
- సంప్రోక్షణ అనంతరం స్వామివారికి నూతన ఆభరణాలను అలంకరించిన అర్చకులు
హైదరాబాద్కు చెందిన ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ మహేశ్వరరెడ్డి దంపతులు ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి మూలవిరాట్కు బంగారు కిరీటాన్ని బహూకరించారు. అలాగే సీతారాముల విగ్రహం, 55 కిలోల వెండితో మకరతోరణం, గర్భాలయ ద్వారాలకు తొడుగులను మహేశ్వరరెడ్డి దంపతులు విరాళంగా అందించారు. ఆలయంలో ఆభరణాలకు సంప్రోక్షణ అనంతరం సోమవారం వాటిని స్వామివారికి అలంకరించారు.
ఈ బంగారు, వెండి ఆభరణాల తయారీకి దాదాపు ఒక కోటి పది లక్షల వరకూ ఖర్చయినట్లు ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ జనరల్ మేనేజర్ వెంకట్ తెలిపారు. ఈ సందర్భంగా దాత మహేశ్వరరెడ్డి కుటుంబ సభ్యులను ఆలయ అధికారులు సత్కరించారు. ఆలయ అర్చకులు వారిని ఆశీర్వదించి ప్రసాదం అందించారు.
