palnadu district: పల్నాడులో ఘోర రోడ్డు ప్రమాదంపై సీఎం, రవాణా మంత్రి దిగ్భ్రాంతి

- పల్నాడు జిల్లా ముప్పాళ్ల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
- మహిళా వ్యవసాయ కూలీలతో వెళుతున్న ట్రాక్టర్ బోల్తా
- నలుగురి మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
- మిర్చి కోతలకు వెళ్లి వస్తుండగా ఘటన
- సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు
పల్నాడు జిల్లా ముప్పాళ్ల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భాంతి వ్యక్తం చేశారు. ఇటువంటి దుర్ఘటన చోటు చేసుకోవడం అత్యంత బాధాకరమని సీఎం అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని సీఎం భరోసా ఇచ్చారు.
ముప్పాళ్ల మండలం బొల్లవరం పరిధిలోని మాదల మేజర్ కాలువ కట్టపై ఆదివారం సాయంత్రం కూలీలతో వస్తున్న ట్రాక్టర్ బోల్తా పడటంతో నలుగురు మహిళా వ్యవసాయ కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి గాయాలు అయ్యాయి. చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళా కూలీలు మిరపకోతలకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మధిర సామ్రాజ్యం (50), మధిర గంగమ్మ (55), చక్కెర మాధవి (30), తేనెపల్లి పద్మావతి (45) మృతి చెందారు. క్షతగాత్రులు సత్తెనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.