Hyderabad: పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం

హైదరాబాద్ పాతబస్తీ చార్మినార్ సమీపంలోని దివాన్దేవిడిలో సోమవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. మదీనా, అబ్బాస్ టవర్స్ లో భారీగా మంటలు చెలరేగాయి. భవనం నాలుగో అంతస్తులో ఉన్న బట్టల షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగి, పక్కన ఉన్న ఇతర వస్త్ర దుకాణాలకు అంటుకున్నాయి.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు. 10 ఫైర్ ఇంజన్లు ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తున్నాయి. కాగా, వరుసగా ఉన్న పలు షాపులకు మంటలు వ్యాపించి భారీగానే ఆస్తి నష్టం వాటిల్లిందని వ్యాపారులు తెలిపారు. అగ్నిప్రమాదంలో భారీగా నష్టం జరగడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.