Chiranjeevi: చిరు నోట తొలిసారి జై జనసేన.. చాలా రోజుల తర్వాత ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన

- విష్వక్సేన్, రామ్ నారాయణ్ కాంబోలో 'లైలా' చిత్రం
- నిన్న హైదరాబాదులో ప్రీ రిలీజ్ ఈవెంట్
- ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి
- నాటి ప్రజారాజ్యం పార్టీనే రూపాంతరం చెంది, జనసేనగా మారిందన్న మెగాస్టార్
విష్వక్సేన్ హీరోగా రామ్ నారాయణ్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం 'లైలా'. సాహు గారపాటి నిర్మించిన ఈ సినిమా ప్రేమికుల రోజు సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం నాడు హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చాలా రోజుల తర్వాత ఆయన ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన తీసుకొచ్చారు. చిరు మాట్లాడుతున్న సమయంలో ఫ్యాన్స్ 'జై జనసేన' అంటూ నినాదాలు చేయడంతో ఆయన కూడా 'జై జనసేన' అని అన్నారు. ఇక చిరంజీవి నోట జై జనసేన అని రావడం ఇదే తొలిసారి. అలాగే నాటి ప్రజారాజ్యం పార్టీనే రూపాంతరం చెంది, జనసేనగా మారిందంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు. దీంతో చిరు వ్యాఖ్యలపై మెగాభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ.. ఆ మరుసటి ఏడాది జరిగిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాల్లో పోటీ చేసి, 18 చోట్ల గెలిచింది. ఆ పార్టీకి 18 శాతం ఓట్లు దక్కాయి. అలాగే చిరు పాలకొల్లు, తిరుపతి నుంచి పోటీ చేయగా, తిరుపతి నుంచి మాత్రం విజయం సాధించారు.
2011లో పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ప్రజారాజ్యం పార్టీ ప్రస్తావన అప్పుడప్పుడు పవన్ తీసుకువచ్చారు తప్పితే, చిరంజీవి మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. ఇన్నాళ్లకు మళ్లీ ఇప్పుడు మెగాస్టార్ ప్రజారాజ్యమే జనసేనగా రూపాంతరం చెందిందని చెప్పడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.