Chandrababu: చంద్రబాబు ప్రచారం చేసిన ఢిల్లీలోని షహాదరాలో మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ విజయం

- 2న ఢిల్లీలో ప్రచారం చేసిన చంద్రబాబునాయుడు
- 1993లో చివరిసారి షహదరాలో బీజేపీ విజయం
- మళ్లీ 32 ఏళ్ల తర్వాత తాజాగా కమలం అభ్యర్థి గెలుపు
ఢిల్లీ ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రచారం చేసిన ఢిల్లీలోని షహదరాలో మూడు దశాబ్దాల తర్వాత బీజేపీ జయకేతనం ఎగురవేసింది. 1993లో తొలిసారి, చివరిసారి ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి రామ్నివాస్ గోయల్ గెలుపొందారు. ఆ తర్వాత 1998, 2003, 2008 ఎన్నికల్లో వరుసగా కాంగ్రెస్ విజయం సాధించింది. 2013లో శిరోమణి అకాలీదళ్, 2015, 2020 ఎన్నికల్లో ‘ఆప్’ విజయం సాధించాయి.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 2న షహదరా నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సంజయ్ గోయల్కు మద్దతుగా చంద్రబాబునాయుడు ప్రచారం చేశారు. నిన్న జరిగిన ఓట్ల లెక్కింపులో గోయల్ 5 వేల ఓట్ల తేడాతో విజయం సాధించారు. 32 సంవత్సరాల తర్వాత అక్కడ బీజేపీ విజయం సాధించడంతో కమలం పార్టీ సంబరాల్లో మునిగిపోయింది.