Chiranjeevi: ఆ కండిషన్ కు ఒప్పుకుంటేనే ఫొటో... ఆసక్తికర అంశం వెల్లడించిన చిరంజీవి

Chiranjeevi felicitates mega blood donors

  • చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కు విచ్చేసిన చిరంజీవి
  • మెగా రక్తదాతలకు సత్కారం
  • రక్తదాతల గొప్పదనాన్ని వివరించిన మెగాస్టార్

పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి తాజాగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్‌కు విచ్చేశారు. శనివారం నాడు ఆయన మెగా రక్త దాతలను సత్కరించారు. వారితో కాసేపు సరదాగా ముచ్చటించారు. ఛారిటబుల్ ట్రస్ట్ విశిష్టతలు, రక్త దాతల గొప్పదనాన్ని వివరించారు. 

ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... "నా చిన్ననాటి మిత్రుడు శంకర్ బ్లడ్ బ్యాంక్‌కి సీఈవోగా ఉన్నారు. మరో మిత్రడు సీజేఎస్ నాయుడు సీఎఫ్‌వోగా సేవలు అందిస్తున్నారు. స్వామి నాయుడు అలుపెరగని సైనికుడిలా, జీవితాన్ని  అంకితం చేస్తూ కొనసాగుతున్నారు. ఆయనే నా బలం. వీళ్లంతా నా వెన్నుదన్నులా ఉండటం వల్లే ఇలాంటి కార్యక్రమాలు విజయవంతంగా ముందుకు తీసుకెళ్లగలుగుతున్నాను. 

రక్తం ఇవ్వడానికి ఒకప్పుడు చాలా భయపడేవాళ్లు. కొంత మంది డబ్బు ఆశ చూపించి రక్తం తీసుకునేవారు. ఇప్పటిలా స్వతాహాగా ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం అనేది అప్పట్లో లేదు. సరైన టైంకి రక్తం అందక ప్రాణాలు పోతున్నాయని తెలిసి బాధపడేవాడ్ని. డెలివరీ టైంలో అధిక రక్తస్రావం జరగడం, తలసేమియా, లుకేమియా, ప్లేట్ లేట్స్ లేక చాలా మంది చనిపోతున్నారని తెలుసుకున్నాను.

నాకు ఇంత మంది అభిమానులు ఉన్నారు కదా... వీరంతా యువకులు... వీరిని సక్రమమైన మార్గంలో పెడితే ఎన్నో అద్భుతాలు చేయొచ్చు కదా అని అనుకున్నాను. అలాంటి టైంలోనే స్వామి నాయుడుని ఈ కార్యక్రమానికి అంకితం కావాలని కోరాను. రక్తం ఇవ్వమని అభిమానుల్ని కోరితే వారు ఇస్తారా? అని మొదట్లో సందేహపడ్డాను. నాతో ఫోటో దిగాలని, నన్ను కావాలని కోరుకునే వారంతా ముందు రక్తం ఇవ్వండి అని కండీషన్ పెట్టాను. 

ఆ టైంలో ఉత్సాహవంతమైన కుర్రవాళ్లంతా రక్తం ఇచ్చారు. నాతో ఫోటో దిగారు. ఇది నిరంతరం సాగుతుందా? ఇచ్చిన వాళ్లు మళ్లీ ఇస్తారా? ఆసక్తి చూపిస్తారా? అని అనుకున్నాను. కానీ ఇప్పుడు మీలో కొన్ని పదులు, వందల సార్లు రక్తం ఇచ్చిన వారున్నారు. సేవా కార్యక్రమంలో ఉన్న ఆ మాధుర్యాన్ని మీరంతా అనుభవిస్తున్నారు కాబట్టే ఇన్నిసార్లు రక్తాన్ని ఇచ్చారనిపిస్తుంటుంది. నా తరువాత చరణ్ కూడా ఈ సేవా కార్యక్రమాల్ని కొనసాగించాలని అనుకుంటున్నాడు. 

ఇటీవల APTA ఈవెంట్‌కు వెళ్లినప్పుడు నేనేం మాట్లాడాలని అనుకున్నాను. నేనేమీ వ్యాపారవేత్తను కాదు.. ఏం మాట్లాడాలా? అని ఆలోచించాను. అందుకే నా గురించి చెప్పాను.. నేను నా సినీ ప్రయాణాన్ని ఎలా ప్రారంభించాను.. ఈ స్థాయికి ఎలా వచ్చానో చెప్పాను. సాదాసీదా కుటుంబం నుంచి వచ్చినా, టాలెంట్ మీద నమ్మకం, బలీయమైన సంకల్పం, అందరి కంటే ప్రత్యేకత ఉండేలా చూసుకున్నాను. 

డ్యాన్సులు, ఫైట్లలో నా ముద్ర వేశాను. రిపీటెడ్‌గా పాటలు, ఫైట్లు వేయించుకుని చూసేవారు. అదే నా ప్రత్యేకత. దాని వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను. ఇతనితో చేస్తే డబ్బులు వస్తాయి.. ఇతని కోసం రిపీటెడ్‌గా ఆడియెన్స్ వస్తున్నారు.. ఇతనితో చేస్తానంటే డబ్బులు పెడతామని డిస్ట్రిబ్యూటర్లు చెప్పేవారు. అలా నన్ను ముందుగా ఆడియెన్స్ ఆదరించారు. ఆ తరువాత కళామతల్లి నన్ను అక్కున చేర్చుకుంది. 

అందుకే నేను ఆడియెన్స్‌కి ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను. ఆడియెన్స్, అభిమానుల సంకల్పం వల్లే ఈ బ్లడ్ బ్యాంక్ నిరంతరంగా సాగుతూ ఉంది. ఇలా రక్తదాతల్ని కుదిరినప్పుడల్లా కలుస్తూ ఉండాలని కోరుకుంటున్నాను. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ అనేది మీ ఇల్లు లాంటిది... మీకు నచ్చినప్పుడు వచ్చి రక్తాన్ని దానం చేయొచ్చు. లవ్ యూ ఆల్" అని అన్నారు.

  • Loading...

More Telugu News