Narendra Modi: ఢిల్లీ ప్రజలు ఇకపై ఆధునిక నగరాన్ని చూడబోతున్నారు: ప్రధాని మోదీ

- ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జయభేరి
- ఆప్ ను చిత్తు చేసి ఢిల్లీ పీఠం చేజిక్కించుకున్న కాషాయ దళం
- విజయోత్సవ సభకు హాజరైన ప్రధాని మోదీ
- ఢిల్లీ ప్రజలు అభివృద్ది వైపు నిలిచారని వెల్లడి
- అవినీతిపై పోరాడతామన్న వారే అవినీతిలో కూరుకుపోయారని విమర్శలు
గతంలో ఎన్నడూ లేనంతగా హోరాహోరీగా సాగిన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ మళ్లీ పాగా వేసింది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజలు ఇకపై ఆధునిక నగరాన్ని చూడబోతున్నారని అన్నారు. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల్లో నిజమైన అభివృద్ధి చూడొచ్చని పేర్కొన్నారు. పనితీరు ఆధారంగానే అనేక రాష్ట్రాల్లో మళ్లీ బీజేపీకే అధికారం ఇస్తున్నారని తెలిపారు. హర్యానాలో సుపరిపాలనకు నాంది పలికామని, మహారాష్ట్ర రైతులకు అన్ని విధాలుగా అండగా ఉన్నామని మోదీ చెప్పారు. బీహార్ లో నితీశ్ కుమార్ కూడా ఎన్డీయేపై విశ్వాసం ఉంచారని, ఏపీలో చంద్రబాబు తన ట్రాక్ రికార్డు నిరూపించుకున్నారని వివరించారు.
బీజేపీ పథకాలు పేదలు, మధ్య తరగతి ప్రజలకు మేలు చేసేలా ఉంటాయని స్పష్టం చేశారు. మోదీ గ్యారెంటీ అంటే తప్పకుండా పూర్తయ్యే గ్యారెంటీ అని ఉద్ఘాటించారు.
"ఢిల్లీని వాతావరణ కాలుష్యం, పారిశుద్ధ్య సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎన్డీయే కూటమే అధికారంలో ఉంది. ఎన్డీయే పాలిత రాష్ట్రాలతో పోల్చితే ఢిల్లీలో పాలన ఎంత అధ్వానంగా ఉందో అందరూ చూశారు. అవినీతిపై పోరాడతామన్న వారే అవినీతిలో కూరుకుపోయారు. ఢిల్లీ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి అవినీతి కేసులో జైలుకు వెళ్లారు. అవినీతికి వ్యతిరేకంగా అన్నా హజారే ఎన్నో సంవత్సరాల పాటు పోరాడారు. ఇవాళ ఆ అవినీతి పార్టీ ఓటమిపై అన్నా హజారే కూడా సంతోషిస్తున్నారు.
అభివృద్ధి వైపే ఉంటామని ఢిల్లీ ప్రజలు ఓటుతో ఘనమైన తీర్పు ఇచ్చారు. యమునా నది మనందరికీ పూజ్యనీయమైన నది. కానీ, ఆ నది పరిశుభ్రతను నిర్లక్ష్యం చేశారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న యమునా నదిని మేం ప్రక్షాళన చేస్తాం. యమునా నది పవిత్రతను కాపాడతాం. ఇది మోదీ గ్యారెంటీ" అంటూ ప్రసంగించారు.
ఈ సందర్భంగా మోదీ కాంగ్రెస్ పార్టీపైనా స్పందించారు. ఢిల్లీలో వరుసగా 6 ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా తెరవలేదని ఎద్దేవా చేశారు. సున్నా సీట్లతో రెండు పర్యాయాలు హ్యాట్రిక్ కొట్టిన కాంగ్రెస్ కు గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చని వ్యంగ్యం ప్రదర్శించారు. కాంగ్రెస్ నేతలను అర్బన్ నక్సల్స్ తో పోల్చారు. కాంగ్రెస్ నేతలు అర్బన్ నక్సల్స్ భాష మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రాల్లో వివిధ వర్గాల ప్రజలను రెచ్చగొట్టడమే కాంగ్రెస్ పని అని మండిపడ్డారు.