Delhi Secretariat: లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలతో ఢిల్లీ సెక్రటేరియట్ సీజ్

- ఢిల్లీ ఫలితాలలో ఓటమి దిశగా ఆప్
- ఎల్జీ ఆదేశాలతో సెక్రటేరియట్ ను సీజ్ చేసిన జీఏడీ
- సచివాలయం నుంచి ఫైల్స్ తరలిపోకుండా ఉండేందుకు ఎల్జీ ఆదేశం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ ఓటమి ఖరారయింది. దేశ రాజధానిలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక ఆదేశాలు జారీ చేశారు. ఢిల్లీ సెక్రటేరియట్ ను సీజ్ చేయాలని ఆదేశించారు. ఆప్ ఓడిపోతున్న క్రమంలో... సెక్రటేరియట్ లోని కీలక ఫైళ్లు తరలిపోకుండా ఉండేందుకు ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. ఆయన ఆదేశాలతో సెక్రటేరియట్ ను జీఏడీ సీజ్ చేసింది.
గత పదేళ్లుగా ఆప్ పై బీజేపీ అవినీతి ఆరోపణలు చేస్తోంది. ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే కాగ్ నివేదికలను అసెంబ్లీలో ప్రవేశపెడతామని గతంలో ప్రధాని మోదీ చెప్పారు. ఇప్పుడు యాక్షన్ తీసుకునేందుకు బీజేపీ రెడీ అవుతోంది.
న్యూఢిల్లీ స్థానం నుంచి కేజ్రీవాల్, జంగ్ పురా నుంచి మనీశ్ సిసోడియా ఓటమిపాలయ్యారు. మొత్తం 70 స్థానాలకు గాను 48 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉండగా, ఆప్ 22 స్థానాల్లో లీడ్ లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట కూడా ప్రభావాన్ని చూపించలేకపోయింది.