TG Inter Exams: కీలక నిర్ణయం తీసుకున్న తెలంగాణ ఇంటర్ బోర్డు

- తెలంగాణలో ప్రారంభమైన ఇంటర్ ఎగ్జామ్స్ హడావుడి
- ప్రాక్టికల్ ఎగ్జామ్స్ జరుగుతున్న సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు
- థియరీ ఎగ్జామ్స్ జరిగే సెంటర్లో కూడా కెమెరాలు ఏర్పాటు చేస్తామన్న ఇంటర్ బోర్డు
తెలంగాణలో ఇంటర్ పరీక్షల హడావుడి ప్రారంభమయింది. ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఎగ్జామ్ సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.
ఇందులో భాగంగా ప్రాక్టికల్స్ జరుగుతున్న సెంటర్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. 417 కాలేజీల్లో అద్దెకు సీసీ కెమెరాలు తీసుకున్నారు. కొన్ని కార్పొరేట్ కాలేజీల్లో ఇప్పటికే కెమెరాలు ఉన్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటును వ్యతిరేకిస్తున్న కాలేజీలకు పరీక్ష కేంద్రాలు ఇవ్వడం లేదు.
90 శాతం సెంటర్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని ఇంటర్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య తెలిపారు. ఎగ్జామ్ సెంటర్లను కమాండ్ కంట్రోల్ సెంటర్ కు అనుసంధానం చేస్తున్నామని చెప్పారు. థియరీ ఎగ్జామ్స్ లో కూడా సీసీ కెమెరాలు ఉంటాయని తెలిపారు. థియరీ ఎగ్జామ్స్ సమయంలో పేపర్ ఓపెన్ చేసే రూమ్ లో, సెంటర్ ఎంట్రన్స్ లో, కారిడార్ లో, గ్రౌండ్ లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.