R Krishnaiah: కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం చొరవ చూపండి: లోకేశ్‌కు ఆర్ కృష్ణయ్య విజ్ఞప్తి

R Krishnaiah meets Minister Nara Lokesh

  • ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను కలిసిన రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య
  • పార్లమెంటు, అసెంబ్లీల్లో బీసీ రిజర్వేషన్ల కోసం ఒత్తిడి తేవాలన్న బీసీ నేత
  • కేంద్ర బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ.1 లక్ష కోట్లు కేటాయించాలని డిమాండ్

ఢిల్లీ పర్యటనలో ఉన్న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్‌ను రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కలిశారు. ఈ సందర్భంగా పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని మంత్రికి అందజేశారు.

బీసీలకు హక్కులు, అవకాశాల కోసం రాజ్యాంగంలో స్పష్టంగా పొందుపరిచినప్పటికీ వారి అభివృద్ధికి ఇంతవరకు నిర్మాణాత్మకమైన చర్యలు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 ప్రకారం 1953లో కాకా కలేల్కర్ కమిషన్, 1978లో మండల్ కమిషన్‌ను నియమించారని, ఆ కమిషన్లు ఆయా కులాల విద్యా, వృత్తి, సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసి వారి అభివృద్ధికి సిఫార్సులను సమర్పించాయని వెల్లడించారు. అయితే, ఆ సిఫార్సులు ఇప్పటికీ అమలుకు నోచుకోలేదని ఆయన అన్నారు. దేశంలో 70 కోట్ల మందికి పైగా ఉన్న బీసీ జనాభా అభివృద్ధి చెందకపోతే భారత్ సూపర్ పవర్‌గా మారడం అసాధ్యమని పేర్కొన్నారు.

దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్నాయని, రాష్ట్రాలను పర్యవేక్షించడానికి, సమన్వయం చేయడానికి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై తెలుగుదేశం పార్టీ తరపున చొరవ చూపాలని కోరారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు బీసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.

బీసీలకు అసెంబ్లీ, పార్లమెంటులో రిజర్వేషన్లు కల్పించాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అసెంబ్లీల్లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించారని గుర్తు చేశారు. బీసీలకు పార్లమెంట్‌, అసెంబ్లీల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం బీసీ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేలా ఒత్తిడి తేవాలని కోరారు.

బీసీ, ఓబీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగాన్ని సవరించి జనాభా దామాషా ప్రకారం బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీలకు మాదిరిగా సామాజిక భద్రతా చట్టాన్ని ఓబీసీలకు కూడా విస్తరించాలన్నారు. ప్రైవేటు రంగంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను అమలు చేయాలని కోరారు.

సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, బ్యాంకు ఛైర్మన్లు, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీల ఛైర్మన్లు, కార్పొరేషన్లు, యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్లు, కేంద్ర స్థాయిలోని ఇతర బోర్డుల అధిపతుల నియామకాల్లో జనాభా ప్రకారం బీసీలకు 50 శాతం కోటా కల్పించాలని కోరారు. కేంద్ర స్థాయిలో బీసీ విద్యార్థులకు ఉపకార వేతనాల మంజూరు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, పోటీ పరీక్షలకు కోచింగ్‌ సెంటర్లు వంటి అనేక పథకాలను ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు.

విద్యారంగంలో బీసీలను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, అందుకోసం బడ్జెట్ కేటాయింపులు జరగాలని ఆయన అన్నారు. బీసీల సామాజిక, విద్య, ఆర్థికాభివృద్ధి, హాస్టళ్ల మంజూరు, వారి సంక్షేమం కోసం ప్రతి సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో లక్ష కోట్ల రూపాయలు కేటాయించేలా గళం విప్పాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జాతీయ విద్యా సంస్థల్లో బీసీ విద్యార్థులకు ఫీజులు మంజూరు చేయడం, ఫీజు రీయంబర్స్‌మెంట్ పథకాలను అమలు చేసేలా చొరవ చూపాలని కృష్ణయ్య మంత్రి లోకేశ్‌ను కోరారు.

R Krishnaiah
Nara Lokesh
Andhra Pradesh
Telugudesam
BJP
  • Loading...

More Telugu News