Delhi: ఢిల్లీ ముఖ్యమంత్రిపై ఎఫ్ఐఆర్

- పోలింగ్కు ముందు రోజు ఢిల్లీ సీఎం అతిశీపై ఎఫ్ఐఆర్ నమోదు
- ఎన్నికల కోడ్ అతిక్రమించారని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు
- ఎన్నికల కమిషన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన సీఎం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్కు ముందు రోజు ముఖ్యమంత్రి, ఆప్ నేత అతిశీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అతిక్రమించారంటూ ఆమెపై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. స్థానిక గోవింద్పూరి పోలీస్స్టేషన్లో ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
ఫతేసింగ్ మార్గ్లో ఆప్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న అతిశీ 50 నుంచి 70 మంది మద్దతుదారులతో పాటు పది వాహనాలతో కనిపించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారి వివరించారు. ఎన్నికల నియమావళి ప్రకారం ఆ ప్రాంతాన్ని ఖాళీ చేయాలని పోలీసులు సూచించగా, తమ విధులను నిర్వర్తించకుండా ఆమె అడ్డుకున్నారని పోలీసులు తెలిపారు.
దీనిపై అతిశీ తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. బీజేపీ అభ్యర్థి రమేశ్ బిధురి, ఆయన కుటుంబ సభ్యులు బహిరంగంగా దాడులకు దిగుతున్నారని విమర్శించారు. వారిపై ఎన్నికల సంఘం ఎటువంటి చర్యలు చేపట్టడం లేదని అన్నారు. ఎన్నికల కమిషన్పై ఆమె విమర్శలు గుప్పించారు.
కాగా, ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉండగా, బుధవారం ఒకే విడతలో పోలింగ్ జరగనుంది.