rathasaptami celebrations: తిరుపతిలో ఘనంగా రథసప్తమి వేడుకలు

- శ్రీవారి వాహన సేవను 2.50 లక్షల మంది భక్తులు తిలకించారన్న ఆలయ ఈవో శ్యామలరావు
- గ్యాలరీల బయట ఉన్న భక్తులు వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేసిన టీటీడీ
- వాహన సేవలు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ
కలియుగ వైకుంఠ క్షేత్రం తిరుమలలో రథసప్తమి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన శ్రీవారి వాహన సేవను 2.50 లక్షల మంది భక్తులు తిలకించారని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈవో శ్యామలరావు తెలిపారు. తిరుమలలో రథసప్తమి వేడుకలను విజయవంతంగా నిర్వహించామని ఆయన పేర్కొన్నారు.
భక్తులకు ఎండ వేడిమి తగలకుండా ఆలయ మాడవీధుల్లో అన్ని ఏర్పాట్లు చేశామని, ఏర్పాట్లపై భక్తులు సంతోషం వ్యక్తం చేశారన్నారు. గ్యాలరీల బయట ఉన్న భక్తులు టీటీడీ ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా వాహన సేవలను తిలకించారని తెలిపారు.
వేడుకలు ప్రారంభమైనప్పటి నుంచి వాహన సేవలు పూర్తయ్యే వరకు నిరంతరాయంగా భక్తులకు అన్న ప్రసాద వితరణ చేశామని ఈవో తెలియజేశారు.