charakonda: నోటీసులు ఇవ్వకుండా ఇళ్లు కూలుస్తున్నారంటూ బాధితుల ఆందోళన .. నాగర్ కర్నూల్ జిల్లాలో ఉద్రిక్తత

- చారకొండలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి ఇళ్లను కూల్చివేసిన రెవెన్యూ అధికారులు
- పోలీసు స్టేషన్లకు బాధితుల తరలింపు
- జీవో జారీ చేసి ఇళ్ల తొలగింపు ప్రక్రియను చేపట్టిన రెవెన్యూ అధికారులు
ఇళ్ల కూల్చివేతతో నాగర్కర్నూలు జిల్లా చారకొండలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారీ పోలీస్ బందోబస్తు నడుమ చారకొండలో బైపాస్ రోడ్డు నిర్మాణానికి జడ్చర్ల – కోదాడ జాతీయ రహదారిపై 29 ఇళ్లను రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. దీంతో అక్కడ బాధితులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
గ్రామం మధ్య నుంచి బైపాస్ తీసుకెళ్లడంపై స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న వారిని సమీప పోలీస్ స్టేషన్ కు తరలించారు. నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఇళ్లు కూలుస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లలోని సామగ్రిని సిబ్బంది రైతువేదిక, పీఏసీఎస్ గోడౌన్లకు తరలించారు. రెవెన్యూ అధికారులు జీవో జారీ చేసి ఈ కూల్చివేతలు చేపట్టారు.